Darshan: జైలులో తోటి ఖైదీలతో.. దర్శన్ వివాదం! బ్యారెక్ వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:21 AM
హత్యకేసులో పరప్పన అగ్ర హార జైలులో గడుపుతున్న నటుడు దర్శన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.
చిత్ర దుర్గ రేణుకాస్వామి హత్యకేసులో పరప్పన అగ్ర హార జైలు (Parappana AgraharaJail) లో గడుపుతున్న నటుడు దర్శన్ (Darshan Thoogudeepa) మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల తోటి ఖైదీలు, దర్శన్ నడుమ వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దర్శన్ బ్యారెక్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా జైలు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.అయితే.. గత కొంతకాలంగా ఈ పరప్పన జైలులో చోటు చేసుకుంటున్న ఘటనలు అటు జైళ్ళ శాఖకు ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తుండటంతో కఠిన చర్యలు అమలులోకి తెచ్చారు.
గతంలో దర్శన్ జైలులోనే విలాసంగా కుర్చీలలో కూర్చొని టీ తాగుతున్న ఫోటోలు వైరల్ అయిన విషయం జైళ్ళ శాఖకు తీరని సిగ్గుచేటు గా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా జైలులో ఉన్న ఓ ఉగ్రవాది మొబైల్ వాడటంతో పాటు, కామాందుడు ఉమేష్ బ్యారెక్లో మొబైల్లో మాట్లాడుతూ టీవీ చూసే వీడియోలు, పోటీలు ఏకంగా జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యాయి. దీంతో ఢిల్లీలో కారుబాంబు పేలుడు దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ఫరప్పన జైలుకు వచ్చి విచారణలు జరపడంతో జైలులో దిగజారుడు వ్యవహారాలు బహిరంగమయ్యాయి.

అయితే.. ఈ వీడియోలు, ఫొటోలు అలా బయటకు రావడానికి దర్శన్కు చెందిన ఆప్తులే కారణమనే ఆరోపణల మేరకు పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇదే విషయంలోనే దర్శన్కు తోటి ఖైదీలకు వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. రేణుకా స్వామి హత్యకేసులో అనుకుమార్, జగ్గ, నాగ రాజు, ప్రద్యూష్, లక్ష్మణు ఒకే బ్యారెక్లో ఉన్నారు. నాగరాజు మినహా మిగిలిన వారు దర్శన్ తమని వేదిస్తున్నాడని ఇటీవల ఆరోపించారు.
అంతేగాక కొన్ని రోజుల కిందట దర్శన్ బ్యారెక్లో జగ్గ, దర్శన్ల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇదే జైలులో ఉంటే చనిపోతానని చిత్రదుర్గ జైలుకు మార్పు చేయాలని అనుకుమార్ జైళ్ళశాఖ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఇలా అన్ని విషయాలలోను దర్శన్ వివాదాల పాలవుతున్నారు. జైళ్లశాఖ సిబ్బంది దర్శన్ బ్యారెక్ వద్ద ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. ఇదిలాఉంటే.. బెయిల్పై బయటకు వచ్చిన దర్శన్ తిరిగి బెయిల్ రద్దై జైలుకు వెల్లే ముందు పూర్తి చేసిన కొత్త చిత్రం ది డెవిల్ (The Devil) ఈ వారం డిసెంబర్ 12న ప్రేక్షకుల ఎదుటకు వస్తోంది.