Mufti Police: 21న థియేటర్లలోకి.. అర్జున్ ‘మఫ్టీ పోలీస్’
ABN , Publish Date - Nov 16 , 2025 | 09:38 PM
యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ‘మఫ్టీ పోలీస్’ ఈ నెల 21న విడుదల కానుంది.
తాను నటించే ప్రతి సినిమా తనకు మొదటి చిత్రమేనని సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) అన్నారు. జీఎస్ ఆర్ట్స్ పతాకంపై అర్జున్ - ఐశ్వర్య (Aishwarya Rajesh) జంటగా నూతన దర్శకుడు దినేష్ లక్ష్మణన్ రూపొందించిన చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’. తెలుగులో ‘మఫ్టీ పోలీస్’ (Mufti Police) గా వస్తోంది. జి.అరుల్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అర్జున్ మాట్లాడుతూ, ‘ఇది నాకు చాలా ముఖ్యమైన చిత్రం. ప్రతి చిత్రం నాకు మొదటి సినిమా వంటిది. సినిమాపై ఉన్న అమితమైన ప్రేమే అరుణ్కుమార్ను నిర్మాతగా మార్చింది. నేను చాలా మంది కొత్త దర్శకులతో పనిచేశాను. కానీ దినేష్ లక్ష్మణన్ ప్రత్యేకమైన వ్యక్తి. ఐశ్వర్య రాజేష్ మంచి నటి. ఆమె తండ్రి నాకు మంచి స్నేహితుడు. అతడితో కలిసి ఐదారు చిత్రాల్లో నటించాను. ఈ సినిమా అందరి ఆశీస్సులు, ప్రేమను పొందాలని కోరారు.
నటి ఐశ్వర్య మాట్లాడుతూ, ‘దర్శకుడు ఈ కథ వివరిస్తున్నపుడు నాలోని ప్రతి అణువు వణికిపోయింది. ఒక నిజమైన స్టోరీ చెబుతుంటే ప్రజలు కూడా బాగా కనెక్ట్ అవుతారు. కమర్షియల్ సినిమా ప్రపంచంలో ఇలాంటి ఒక వాస్తవ కథను ప్రేక్షకులకు చెప్పాలని దర్శకుడు భావించడం పెద్ద సాహసం. యాక్షన్ కింగ్ అర్జున్ నిజ జీవితంలో జెంటిల్మేన్. ఆయన మాయాజాలాన్ని ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను’ అన్నారు.
చిత్ర దర్శకుడు దినేష్ మాట్లాడుతూ, ‘నా 15 యేళ్ళ దాహమే ఈ సినిమా. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు. నాలో సినిమా కోరికను ప్రేరేపించిన వ్యక్తి మా నాన్న. నిర్మాత అరుల్ కుమార్కు సినిమా అంటే పిచ్చి. ఆయన తీసిన రెండు చిత్రాలు నిరాశపరిచాయి. కానీ, నాకు ఇచ్చిన మాట కోసం ఈ సినిమా నిర్మించారు. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అన్నారు.