Kingdom: మరి కొద్ది గంటల్లో.. ఆ ఓటీటీకి కింగ్డమ్!
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:51 AM
ఇటీవల థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న కింగ్డమ్ చిత్రం మరి కొద్ది గంటల్లో స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.
జూలై 31న థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న చిత్రం కింగ్డమ్ (Kingdom). చాన్నాళ్లుగా విజయం కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎన్నో ఆశలతో చేసిన ఈ చిత్రం ప్రేక్షకులకు అశించినంత వినోదం పంచలేక పోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ సినిమాను నిర్మించగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్వకత్వం వహించాడు. సత్యదేవ్ (Satyadev), భాగ్యశ్రీ భోర్సే (Bhagyasri Borse) , వెంకిటేశ్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
బ్రిటీష్ కాలంలో ఏపీ శ్రీకాకుళం నుంచి ఓ తెగకు సంబంధించిన ఫ్యామిలీలు శ్రీలంకకు వలస వెళ్లి అక్కడి దేశం నుంచి గుర్తింపు లేక బయటకి ప్రపంచానికి సంబంధం లేకుండా ఓ మాఫియా కనుసన్నలో జీవించాల్సి వస్తుంది. తిరిగి తమ సొంత ప్రాంతానికి రావాలని ప్రయత్నం చేసినా కుదరదు. ఈ క్రమంలో ఆరు దశాబ్దాల తర్వాత ఏపీలోని ఓ టౌన్ నుంచి ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ ఇంటి నుంచి పారిపోయి శ్రీలంక చేరుకుంటాడు. ఆపై అక్కడి తెలుగు వారి తెగతో మమేకమై కాలక్రమంలో వారికి నాయకుడు అవుతాడు.
తన అన్న కోసం మరో దశాబ్దం నుంచి ఎదురు చూస్తున్న, వెతుకుతున్న కానిస్టేబుల్ సూరికి తన అన్న శివ శ్రీలంక జాఫ్నాలో ఓ తెగకు లీడర్గా ఉన్నాడని తెలుసుకుని అతన్ని తీసుకు రావడానికి, అక్కడ జరుగుతున్న మాఫియా గుట్టు బయట పెట్టడానికి స్పైగా వెళతాడు. ఈ నేపథ్యంలో సూరి తన అన్నను తిరిగి ఇండియాకు తీసుకు రాగలిగాడా లేదా, ఇంతకు అక్కడ జరిగే వ్యవహారం ఏంటి, స్పైగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందనే పాయింట్తో కథ నడుస్తుంది. ఇప్పుడీ సినిమా ఆగస్టు 27 బుధవారం నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లో మిస్సయిన వారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్ చేయవచ్చు.