Malladi RamaKrishna Sastry : సాహో... మల్లాది రామకృష్ణ శాస్త్రి

ABN , Publish Date - Jun 16 , 2025 | 06:53 PM

తెలుగు పాటకు జిలుగులద్దిన మేటి గీతరచయితల్లో మల్లాది రామకృష్ణ శాస్త్రి (Malladi Ramakrishna Sastry) స్థానం ప్రత్యేకమైనది. నాటకీయ ఫక్కీలో సాగుతున్న తెలుగు పాటను సముద్రాల రాఘవాచార్యులు ఓ కొత్త బాటలో పయనింప చేశారు.

తెలుగు పాటకు జిలుగులద్దిన మేటి గీతరచయితల్లో మల్లాది రామకృష్ణ శాస్త్రి (Malladi Ramakrishna Sastry) స్థానం ప్రత్యేకమైనది. నాటకీయ ఫక్కీలో సాగుతున్న తెలుగు పాటను సముద్రాల రాఘవాచార్యులు ఓ కొత్త బాటలో పయనింప చేశారు. ఆ తరువాత తెలుగుదనం అద్దుతూ మల్లాది రామకృష్ణ శాస్త్రి సాగారు. వీరిద్దరిదీ అన్నదమ్ముల అనుబంధం. ఆరంభంలో సముద్రాలకు మల్లాది ఘోస్ట్ గానూ సాగారని అంటారు. అంతెందుకు 1953లో రూపొందిన 'దేవదాసు' సినిమాలోని పాటలన్నీ జనాన్ని విశేషంగా అలరించాయి. ఆ పాటలు రాసింది మల్లాది అని తరువాతి రోజుల్లో శ్రీశ్రీనే స్వయంగా తెలిపారు. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందే మల్లాది రామకృష్ణ శాస్త్రి తెలుగు సాహితీవనంలో వాడని పువ్వులా పరిమళాలు వెదజల్లారు. గూడవల్లి రామబ్రహ్మం 'పల్నాటి యుద్ధం' రూపొందించే రోజుల్లో మల్లాదివారిని మద్రాసు పిలిపించారు. ఆ సమయంలో రామబ్రహ్మం మల్లాది సలహాలు, సూచనలు తీసుకున్నారు. తరువాత మద్రాసులోనే ఉంటూ సాయంత్రం పానగల్లు పార్కులోనో, మెరీనా బీచ్ లోనో మల్లాది విద్వత్సభలు నడిపారు. ఆ సభల్లోనే తెలుగు భాషకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను మల్లాది ఉటంకించేవారు. అలా ఎందరో రామకృష్ణశాస్త్రిని గురువుగా భావించి ఆరాధించేవారు. అలా మల్లాది సాహితీ సభలంటే ఆ రోజుల్లో ప్రాణం పెట్టిన వారిలో ఆరుద్ర (Arudra), వేటూరి సుందరరామమూర్తి (Veturi)కూడా ఉన్నారు. 1952దాకా మల్లాది రాసిన అనేక పాటలు వేరే పేర్లతో వెలుగు చూశాయి. 'చిన్నకోడలు' సినిమాతో తొలిసారి మల్లాది రామకృష్ణ శాస్త్రిపేరు తెరపై కనిపించింది. ఆయనకు ఎందువల్లో పెద్దగా పేరు పట్టింపు ఉండేది కాదు. అయితే సందర్భానికి అనువుగా పాటలు పలికించడంలో తనదైన బాణీ పలికిస్తూ ఉండేవారు.

వినోదా సంస్థ నిర్మించిన 'దేవదాసు'కు ఘోస్ట్ గా పనిచేసిన మల్లాది తరువాత ఆ సంస్థ తెరకెక్కించిన 'చిరంజీవులు, కన్యాశుల్కం' సినిమాలకు పాటలు పలికించారు. వినోదా సంస్థాధినేత డి.యల్.నారాయణకు మల్లాది వాణి అంటే ఎంతో అభిమానం. 'చిరంజీవులు' సినిమా ఫస్ట్ రిలీజ్ లో అంతగా అలరించలేక పోయింది. అయితే అందులోని ఘంటసాల సంగీతం, మల్లాది రామకృష్ణశాస్త్రి పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రిపీట్ రన్స్ లో 'చిరంజీవులు'లోని "కనుపాప కరవైన కనులెందుకు..." పాట రాగానే ఈలలు, కేకలతో థియేటర్లు మారుమోగి పోయేవి. ఇదే సినిమాలో 'తెల్లవార వచ్చె తెలియక నా స్వామి...' అంటూ సాగే పాట కూడా మంచి ఆదరణ పొందింది. అయితే స్వయంగా మల్లాది ఆ పాటకు సందర్భశుద్ధి లేదని ప్రకటించడం ఆయన నిజాయితీకి తార్కాణం. ఇక యన్టీఆర్ హీరోగా రూపొందిన "రేచుక్క, జయసింహ, చరణదాసి, సొంతవూరు, రాజనందిని, కార్తవరాయని కథ, దేశద్రోహులు" వంటి చిత్రాల్లోనూ మల్లాది పంచిన సాహితీసుగంధం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఏయన్నార్ హీరోగా రూపొందిన "జయభేరి, రహస్యం" సినిమాల్లో మల్లాది పాటలు పులకింప చేశాయి.

మల్లాది రామకృష్ణ శాస్త్రి 1905 జూన్ 16న కృష్ణాజిల్లా చిన్నగూడురులో జన్మించారు. పిన్నవయసులోనే అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించి రచనలు సాగించారు. మచిలీ పట్నంలో బి.ఏ. పట్టా పుచ్చుకున్నరామకృష్ణ శాస్త్రి మదరాసులో తెలుగు, సంస్కృత భాషల్లో ఎమ్.ఏ. చేశారు. వేదాలు, మహాభాష్యం, బ్రహ్మసూత్రాలపై పట్టు సాధించారు. ఇక జాను తెలుగులోని పదాలను ఏరి మరీ వాటి గొప్పతనాన్ని వివరిస్తూ ఉండేవారు. చిత్రసీమలోనూ మల్లాది తెలుగు పదాలతో చేసిన విన్యాసాలు పులకింప చేశాయి. 1965 సెప్టెంబర్ 12న మదరాసులో కన్నుమూశారు మల్లాది. ఆయన పాండిత్యాన్ని తరువాతి రోజుల్లో ఆరుద్ర, వేటూరి వంటివారు పదే పదే స్మరించుకొనేవారు. ఇక ఆయన సాన్నిహిత్యంతోనే తాను సరస్వతీ కటాక్షం పొందానని ప్రఖ్యాత విమర్శకులు వి.ఏ.కె.రంగారావు చెప్పేవారు. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలోనే కాదు, సాహితీవనంలోనూ మల్లాది రామకృష్ణ శాస్త్రి ముద్ర చెరిగిపోనిది అని చెప్పవచ్చు. అందుకే సమకాలికులు సైతం 'సాహో' అంటూ రామకృష్ణ శాస్త్రికి వందనం చేసేవారు.

Updated Date - Jun 16 , 2025 | 06:54 PM