Tollywood: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సినీ జంట

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:44 PM

రాష్ట్రపతి నిలయం ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ వేడుకకు సీనియర్ నటీమణి రోజా రమణి, నటుడు చక్రపాణి హాజరయ్యారు. భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మును కలవడం ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు.

Roja Ramani, Chakrapani at Home Ceremony

భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ని సీనియర్ నటి రోజారమణి (Roja Ramani), ఆమె భర్త, ప్రముఖ నటుడు చక్రపాణి (Chakrapani) రాష్ట్రపతి నిలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ వార్షిక శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్ హోమ్’ (At Home) వేడుకకు సినీ పరిశ్రమ నుండి రోజారమణి - చక్రపాణి దంపతులకు ఆహ్వానం అందింది. బాలనటిగా 'భక్త ప్రహ్లాద' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రోజారమణి, నటుడిగా చక్రపాణి భారత రాష్ట్రపతిని కలవడం తమ జీవితంలో ఒక మరపురాని క్షణం అని సామాజిక మాధ్యమాల ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. దేశ అత్యున్నత వ్యక్తిని నేరుగా కలిసి మాట్లాడటం గొప్ప గౌరవంగా వారు భావిస్తున్నారు.


12.jpg

ఈ కార్యక్రమంలో కేవలం సినీ రంగ ప్రముఖులే కాకుండా, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అటువంటి ప్రతిష్టాత్మక వేదికపై రోజారమణి దంపతులు రాష్ట్రపతితో ఫోటోలు దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక భేటీ అనంతరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 6 రోజుల దక్షిణ భారత పర్యటనను ముగించుకుని ఢిల్లీకి తిరిగి ప్రయాణమయ్యారు. ఒక సీనియర్ నటిగా తనదైన ముద్ర వేసిన రోజారమణి, దేశ ప్రథమ పౌరురాలిని కలిసి అభినందనలు అందుకోవడం ఆమె అభిమానులకు, సినీ వర్గాలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

Updated Date - Dec 22 , 2025 | 11:45 PM