8 Vasantalu Movie Review : 8 వసంతాలు మూవీ రివ్యూ
ABN , Publish Date - Jun 20 , 2025 | 08:44 AM
'మను’, 'మధురం' చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఫణీంద్ర నర్సెట్టి హిట్ అందుకున్నాడా? రివ్యూలో చూద్దాం.
'మను', 'మధురం' చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasantalu). అనంతిక సనీల్కుమార్ (Ananthika Sanil Kumar), రవి దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి కీలక పాత్రధారులు. చిన్న. పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలకు పట్టం కడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రమిది. ఫస్ట్ లుక్ నుంచి ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా వైపు తిప్పుకొన్నాయి. నిర్మాణ సంస్థకు ఉన్న క్రేజ్తో సినిమాకు బజ్ పెరిగింది.
కథ : (8 Vasantalu Story)
శుద్థి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) స్ట్రాంగ్ లేడీ. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తన అనుభవాల సమాహారంగా పదిహేడేళ్లకే భావోద్వేగభరితంగా ఓ పుస్తకం రాస్తుంది. అది చదివి ఎంతోమంది ఆమెకు అభిమానులుగా మారతారు. ఆమెలో చక్కని రచయిత్రే కాదు.. తల్లిపై ప్రేమ, బాధ్యత, మార్షల్ ఆర్ట్స్ గురువు అంటే గౌరవం, స్నేహితుల పట్ల కరుణ వంటి స్వభావాలు ఉంటాయి. మార్షల్ ఆర్ట్స్లో మంచి ప్రావీణ్యం ఉన్న శుద్ధికి ఓ రోజు మార్షల్ డోజోలో వరుణ్ (హను రెడ్డి) పరిచయం అవుతాడు. చూసిందే తడవు.. ఆమె ప్రేమకోసం తపిస్తూ వెంటపడతాడు. కొంత సమయంలో తర్వాత ఆమె తనపై ప్రేమను పెంచుకుని చెప్పేలోపు వరుణ్ బర్క్లీలో తన గోల్ సాధించడం కోసం ఆమెను వదిలించుకుని విదేశాలకు వెళ్లిపోతాడు. పగిలిన గుండెతో ఆమె మరో పుస్తకం రాస్తుంది. తదుపరి ఊటీలో తెలుగు రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు. అతనిని శుద్ధి ప్రేమిస్తుంది. తల్లికి చెబుదామనుకునేలోపు తల్లి ఆరోగ్యం బాగోకపోవడం, ఎస్టేట్స్ చూసుకునే బాధ్యత మీద పడటంతో తన ప్రేమ సంగతి తల్లికి చెప్పలేకపోతుంది. తల్లి ఉన్న పరిస్థితిని బట్టి తన ప్రేమను మనసులోనే దాచుకుంటుంది. సంజయ్ ఆమె ప్రేమను గెలిచాడా? 8 వసంతాలకు, సంజయ్కు సంబంధం ఏంటి? అన్నది కథ.
విశ్లేషణ:
‘మను’, 'మధురం' వంటి చిత్రాల దర్శకుడి నుంచి వచ్చిన ప్రేమకథ ఇది. గతంలో ఆయన తీసిన సినిమాల రిజల్ట్ బాధ పెట్టి ఉండొచ్చు. ఆ కసితోనే '8 వసంతాలు' చిత్రాన్ని తీసినట్లు సినిమా ప్రారంభంలో అనిపిస్తుంది. 2013 నుంచి 2020 మధ్యలో జరిగే ఓ సున్నిత ప్రేమకథ ఇది. స్ట్రాంగ్ అండ్ టాలెంటెడ్ లేడీకి జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల నేపథ్యంలో ఓ ప్రేమకథగా మలిచారు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకూ ఫ్లో బావుంది. అయితే అక్కడక్కడా కాస్త సాగదీతగా ఉన్నా.. శుద్ధి పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ సాగదీత అనేది గుర్తుకు రాదు. దర్శకుడు కథను పూర్తిగా కవితాత్మకంగా తెరపై చూపించాలనుకున్నాడు. ఆ తరుణంలో అతనిలోని రచయిత దర్శకుడిని డామినేట్ చేసిన భావన కలుగుతుంది. మాటలు బాగా రాసుకున్నాడు అయితే తన రాతతో కథను మించి కవిత్వం పెరిగింది. ప్రాసల కోసం తపన కనిపించింది. కొన్ని సందర్భాల్లో సంభాషణలను కవిత్వమే డామినేట్ చేసింది. . వరుణ్ క్యారెక్టర్ ఎంట్రీ, అతని రన్ చూస్తే నెగటివ్ అని గెస్ చేసేలా ఉంది. ఇంటర్వెల్ వరకూ సినిమా ఒకలా ఉంటే.. అక్కడి నుండి మరోలా ఉంది. కొన్ని డైలాగ్స్ మాత్రం మనసుల్ని కట్టిపడేస్తాయి.
నటీనటులు పనితీరు.. శుద్థి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్ కుమార్ అద్భుతంగా నటించింది. హను రెడ్డి వరుణ్ పాత్రకు న్యాయం చేశాడు. శుద్ధి స్నేహితుడి కన్నా పసునూరి కార్తిక్ పాత్రకు తగ్గట్టుగా నటించాడు. మిగతా నటీనటుల్లో గుర్తు పెట్టుకునేవారు ఎవరూ లేదు.
సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్రెడ్డి విజువల్ పరంగా ఎక్కడా పేరు పెట్టకుండా ప్రతీ సీన్ను అందంగా క్యాప్చర్ చేశారు. అలాగే సినిమాకు మ్యూజిక్ ఎసెట్. హేషమ్ అబ్దుల్ వాహబ్ వినసొంపైన పాటలు, ఆర్ఆర్ అందించారు. నిర్మాతలు ఖర్చు తెరపై కనిపించింది. సింపుల్, కూల్ లవ్స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ యాక్షన్ హంగామా కోరుకునే ప్రేక్షకుల నుంచి ఆదరణ తక్కువే ఉంటుంది.
ట్యాగ్లైన్: అక్కడక్కడా వసంతం
రేటింగ్: 2.5/5