సీనియర్ నిర్మాత మహేంద్ర కన్నుమూత
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:32 AM
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం...
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర తన స్వస్థలమైన గుంటూరులోని రమేశ్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నటుడు, నిర్మాత మాదాల రవి ఆయనకు అల్లుడు. కుమారుడు జీతూ కొన్నేళ్ల క్రితమే మరణించారు. ప్రొడక్షన్ మేనేజర్గా కెరీర్ ప్రారంభించిన మహేంద్ర తర్వాత నిర్మాణరంగంలోకి ప్రవేశించి గీతా ఆర్ట్ పిక్చర్స్, ఎ.ఎ. ఆర్ట్స్ బేనర్లపై 36 చిత్రాలు నిర్మించారు. 1977లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ నిర్మాతగా మహేంద్ర తొలి సినిమా. రాజశేఖర్ హీరోగా నటించిన ‘అర్జున’ ఆయన చివరి చిత్రం.