Anushka Shetty: అనుష్క పోస్టర్ చూస్తూ.. 40 యాక్సిడెంట్స్!
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:21 AM
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్...
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్. ‘‘వేదం’కు 15 ఏళ్లు. నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రమిది. ఇతర సినిమాలతో పోలిస్తే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. దర్శకుడు క్రిష్కు రుణపడి ఉంటాను. ఎంతో నిజాయితీగా సినిమా తీశారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, అనుష్క వంటి సహనటులతో ప్రయాణించడం ఓ గొప్ప జ్ఞాపకం. ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు శోభు, ప్రసాద్ దేవినేనిలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.
ముందు అనుకున్న సినిమా వేరు
ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఓ సందర్భంలో పంచుకున్నారు క్రిష్. ‘‘గమ్యం’ తరువాత ఓ పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రానికి ప్లాన్ చేశాను. అయితే ఆ సమయంలో అమరావతికి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన ‘వేదం’ కథ సిద్ధం చేసేలా చేసింది. ఓ చిన్న పిల్లాడు వృద్ధుడిని వేలు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యం నన్ను కదిలించింది. ‘ఒక చిన్న పిల్లాడు వెట్టిచాకిరీ చేస్తాడు. వాడిని విడిపించుకోవడానికి వాళ్లమ్మ కిడ్నీలు అమ్ముతుంది’ ఇలాంటి ఓ లైన్తో మొదలైంది ‘వేదం’ కథ.
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క భాగం కావడంతో ఈ సినిమా పెద్ద సినిమాలా మారింది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా అనుష్క వెనక్కి తిరిగి కొంటెగా చూస్తున్న పోస్టర్ను పెద్ద హోర్డింగ్గా చేసి పంజాగుట్ట సర్కిల్లో పెట్టారు. ఆ సమయంలో 40కి పైగా ప్రమాదాలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ తర్వాత పోస్టర్ను తొలగించారు. అంతలా అనుష్క ఆకట్టుకున్నారు’’ అని అన్నారు దర్శకుడు క్రిష్.