ఆ నలుగురు అనేది కరెక్ట్ కాదు
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:03 AM
‘మోదీ గారే పవన్ కల్యాణ్ని తుఫాన్ అన్నారు. ఆయన సినిమాను ఎవరు ఆపుతారు. ఆ నలుగురు అనేది కరెక్ట్ కాదు. ఎవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయనే లెక్కలు చూస్తే ఆ నలుగురు అనే టాపిక్ ఉండదు’ అని (టీఎఫ్సీసీ) అధ్యక్షుడు...
‘మోదీ గారే పవన్ కల్యాణ్ని తుఫాన్ అన్నారు. ఆయన సినిమాను ఎవరు ఆపుతారు. ఆ నలుగురు అనేది కరెక్ట్ కాదు. ఎవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయనే లెక్కలు చూస్తే ఆ నలుగురు అనే టాపిక్ ఉండదు’ అని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్సీసీ) అధ్యక్షుడు సునీల్ నారంగ్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఎక్కువ సినిమాలు రావాలి. థియేటర్లు నడవాలి. హీరోలు గాడ్స్ వంటి వారు. వారు ఏం చేయాలనేది మేం చెప్పలేం. కొత్త కమిటీ అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. ప్రొడ్యూసర్ బాగా లేడు, డిస్ట్రిబ్యూటర్ బాగా లేడు. ఓటీటీ, క్యూబ్, బుక్ మై షో సంస్థలు మాత్రమే బాగున్నాయి’ అని అన్నారు. టీఎఫ్సీసీ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ ‘సింగిల్ స్ర్కీన్లు బంద్ అయిపోతున్నాయి. 2016 నుంచి పర్సటేంజీ విధానం కోసం ప్రయత్నిస్తున్నాం. మేము థియేటర్లు బంద్ అని ఎప్పుడూ అనలేదు. పవన్ కల్యాణ్ సినిమా వస్తోందని థియేటర్లు ఖాళీగా ఉంచాం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కేవలం మూడు సినిమాలు మాత్రమే హిట్ కొట్టాయి. ప్రతి హీరో ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని కోరుతున్నాం’ అని అన్నారు.
టీఎఫ్సీసీ కొత్త కమిటీ
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో కొత్త కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రవీంద్ర గోపాల, ఉదయ్ కుమార్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీధర్, సంయుక్త కార్యదర్శిగా చంద్రశేఖర్ రావు, కోశాధికారిగా సత్యనారాయణ గౌడ్ ఎన్నికయ్యారు. వీరితోపాటు 15 మందిని కార్యనిర్వాహక సభ్యులుగా ప్రకటించారు.