Telugu Cinema Awards: తెలుగు సినిమాకు అవార్డుల పంట

ABN , Publish Date - May 31 , 2025 | 04:58 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014-2023 మధ్య విడుదలైన సినిమాలకు గద్దర్‌ తెలంగాణ సినీ పురస్కారాలు ప్రకటించింది. జ్యూరీ చైర్మన్‌ మురళీమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం, బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, మణిరత్నం‌కు పైడి జైరాజ్‌ అవార్డు వరించింది.

  • 2014- 2023 సినిమాలకు పురస్కారాలు

  • ప్రకటించిన జ్యూరీ చైర్మన్‌ మురళీమోహన్‌

  • ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఎంపిక

  • నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 - 2023 మధ్య విడుదలైన సినిమాలకు అందించనున్న గద్దర్‌ తెలంగాణ సినీ పురస్కారాలను జ్యూరీ కమిటీ చైర్మన్‌, సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ ప్రకటించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజుతో కలసి ఆయన అవార్డుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్‌ 2 నుంచి సెన్సార్‌ అయిన చిత్రాలనే పరిశీలనకు తీసుకున్నట్లు తెలిపారు. మురళీ మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అవార్డులను ఇవ్వడం ఆపివేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బాధ్యతగా తీసుకొని గద్దర్‌ పురస్కారాలను ప్రారంభించారని పేర్కొన్నారు. జ్యూరీ కమిటీ ఏకాభిప్రాయంతో ప్రతి ఏడాదికి మూడు చిత్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. వీటితో పాటు సినీ రంగానికి సేవలందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుకు నందమూరి బాలకృష్ణ, పైడి జైరాజ్‌ ఫిల్మ్‌ అవార్డుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంపికయ్యారు.


ఏపీలోనూ అవార్డులు ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ పురస్కారాలు ప్రకటించాలని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమాకు అవార్డులు ఇచ్చే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని సూచించారు. ‘ఒకే తెలుగు సినిమాకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఇలా చేయడం అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తుంది. దీనికి బదులుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఒక నిర్ణయానికి రావాలి. ఒక ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే, మరుసటి ఏడాది ఏపీ ప్రభుత్వం ప్రకటించాలి. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాలను తెలంగాణ, ఆంధ్రా అంటూ వేర్వేరుగా చూడొద్దు. తెలుగు సినిమా ఒక్కటే. మనమంతా ఒక్కటే. మన సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. మనకంటే ముందు సినిమాని అమెరికాలో చూస్తున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంటే తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరుగుతుంది. విదేశాల్లోనూ మనకు మరింత ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది’ అని అన్నారు.


  • ప్రత్యేక పురస్కారాలు

1. ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు - నందమూరి బాలకృష్ణ

2. పైడి జైరాజ్‌ ఫిల్మ్‌ అవార్డు - మణిరత్నం

3. బి.ఎన్‌.రెడ్డి ఫిల్మ్‌ అవార్డు - సుకుమార్‌

4. నాగిరెడ్డి- చక్రపాణి ఫిల్మ్‌ అవార్డు - అట్లూరి పూర్ణచంద్రరావు

5. కాంతారావు ఫిల్మ్‌ అవార్డు - విజయ్‌ దేవరకొండ

6. రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు - యండమూరి వీరేంద్రనాథ్‌

7. స్పెషల్‌ జ్యూరీ అవార్డు - ప్రజాకవి కాళోజీ

Updated Date - May 31 , 2025 | 06:59 AM