సినిమాకు కథే ప్రాణం
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:20 AM
‘మంచి కథే సినిమాకు ప్రాణం. మొదట్నుంచి ఆ కథను నమ్ముకునే సినిమాలు తీశాను.. ‘తల్లి మనసు’ చిత్రం కూడా ఇంటిల్లిపాది చూసే విధంగా చక్కగా రూపుదిద్దుకుంది’ అని సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అన్నారు...
‘మంచి కథే సినిమాకు ప్రాణం. మొదట్నుంచి ఆ కథను నమ్ముకునే సినిమాలు తీశాను.. ‘తల్లి మనసు’ చిత్రం కూడా ఇంటిల్లిపాది చూసే విధంగా చక్కగా రూపుదిద్దుకుంది’ అని సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అన్నారు. రచిత మహాలక్ష్మీ, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా వి.శ్రీనివా్స (సిప్పి) దర్శకత్వంలో ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల కిశోర్ నిర్మించిన చిత్రం ‘తల్లి మనసు’. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ముత్యాల సుబ్బయ్య పాత్రికేయులతో మాట్లాడుతూ ‘దర్శకుడిగా 50 సినిమాలు తీశాను. మంచి కథలను ఎంచుకోవడమే కాదు, వాటికి తగ్గ మంచి టైటిల్స్ పెట్టి, ప్రేక్షకుల ఆదరణతో నా సినీ ప్రయాణం సాగింది. నా దగ్గర, చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న వి.శ్రీనివా్సని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.
ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఉంటుందీ చిత్రం. ఫీల్ గుడ్ మూవీ అని సెన్సార్ సభ్యులు కూడా ప్రశంసించారు. తల్లి లేకుండా ప్రపంచమే లేదు. అలాంటి తల్లి భావోద్వేగం, తపనను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించాం. కథకు తగ్గట్టు మూడు పాటలు ఉంటాయి’ అని తెలిపారు.