Sekhar Kammula: మీరే నాకు స్ఫూర్తి

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:40 AM

శేఖర్‌ కమ్ముల సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. చిరంజీవిని తన స్ఫూర్తిగా పేర్కొంటూ శేఖర్‌ కమ్ముల సోషల్‌ మీడియా ద్వారా భావోద్వేగాలను పంచుకున్నారు.

  • చిరంజీవిని కలసిన శేఖర్‌ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ‘25 ఇయర్స్‌ ఆఫ్‌ శేఖర్‌ కమ్ముల’ సెలబ్రేటింగ్‌ ది సోల్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌ అనే పోస్టర్‌ని చిరంజీవి ఆవిష్కరించి, అభినందించారు. ఈ విషయాన్ని శేఖర్‌ కమ్ముల సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ‘టీనేజ్‌లో ఉన్నప్పుడు మెగాస్టార్‌ చిరంజీవిని ఒకసారి దగ్గర నుంచి చూశాను. ఈయనతో సినిమా చేయాలనే భావన కలిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. దీనిని సెలెబ్రేట్‌ చేసుకుందామని మా టీమ్‌ అనగానే వెంటనే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే. కొన్ని తరాల వారిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. కలలను వెంటాడితే విజయం తప్పకుండా మనల్ని అనుసరిస్తుందని నమ్మకం కలిగించింది ఆయనే. నా ఈ 25 ఏళ్ల వేడుకను ఆయన సమక్షంలో చేసుకోవాలనిపించింది. థాంక్యూ సర్‌. ఈ క్షణంలోనే కాదు నా టీనేజ్‌ నుంచి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’ అని శేఖర్‌ కమ్ముల ఆ పోస్టులో పేర్కొన్నారు. చిరంజీవితో కలసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Jun 01 , 2025 | 03:41 AM