ఆ ఉద్దేశంతోనే నిర్మాతగా మారా

ABN , Publish Date - May 06 , 2025 | 05:18 AM

‘‘నేను వైజాగ్‌ వస్తే, ప్రతీ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతోంది. ఇక్కడి అభిమానుల్ని చూశాకే నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. దర్శకుడు ప్రవీణ్‌ ఎనర్జీ చూసి అంతా మర్చిపోయాను’’ అని అన్నారు సమంత....

‘‘నేను వైజాగ్‌ వస్తే, ప్రతీ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతోంది. ఇక్కడి అభిమానుల్ని చూశాకే నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. దర్శకుడు ప్రవీణ్‌ ఎనర్జీ చూసి అంతా మర్చిపోయాను’’ అని అన్నారు సమంత. ఆమె నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గవిరెడ్డి, చరణ్‌ పెరి, షాలినీ కొండెపూడి ప్రధాన పాత్రల్లో ప్రవీణ్‌ కండ్రీగుల తెరకెక్కించారు. ఈ నెల 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వైజాగ్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘నిర్మాతగా ఓ కొత్త ఆలోచనతో ఈ చిత్రాన్ని ప్రారంభించాను. కొత్తవారితో కొత్తకథల్ని నిర్మించి ప్రేక్షకులను అలరించడమే ఉద్దేశంగా ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ను మొదలుపెట్టాను. థియేటర్‌లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ నవ్వుతూ బయటకి వస్తారు’’ అని చెప్పారు. ‘‘సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకూ తెలుగులో ఇలాంటి కంటెంట్‌తో సినిమా రాలేదు. సమంత లేకపోతే ‘శుభం’ ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు’’ అని దర్శకుడు ప్రవీణ్‌ కండ్రీగుల తెలిపారు. ‘‘నిర్మాతగా సమంత ఎంతో ప్యాషన్‌తో తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని హర్షిత్‌ రెడ్డి అన్నారు. ‘‘ఇది అందర్నీ మెప్పించే హారర్‌ కామెడీ’’ అని చరణ్‌ పెరి చెప్పారు. ‘‘సమంత ధైర్యం చేసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఎంతో మంది వెండితెరకు పరిచయమవ్వడం శుభపరిణామం’’ అని శ్రీనివాస్‌ గవిరెడ్డి తెలిపారు.

Updated Date - May 06 , 2025 | 05:18 AM