ఆ సినిమాతో ముడిపెట్టడం సరికాదు - ఆర్‌. నారాయణ మూర్తి

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:36 AM

సీనియర్ నటుడు ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పర్సంటేజ్‌ సమస్యను ముడిపెట్టడం సరికాదన్నారు. సింగిల్ థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్‌ విధానం స్పష్టత అవసరమని తెలిపారు.

R Narayana Murthy: ‘ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అనడంలో తప్పులేదు. సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను ప్రభుత్వం మరోసారి పిలిస్తే బాగుండేది’ అని అన్నారు సీనియర్‌ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గద్దర్‌ అవార్డులు ప్రకటించడం గర్వంగా ఉంది. ఏపీలో కూడా ‘నంది’ అవార్డులు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. పర్సంటేజీ విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం కోసమే థియేటర్లు బంద్‌ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. పర్సంటేజీ ఖరారైతే నాలాంటి ఎంతోమంది నిర్మాతలకు మేలు కలుగుతుంది. అయితే, ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రస్తావన లేకుండా సమస్యలపై చర్చించడానికి పిలిస్తే పవన్‌పై గౌరవం మరింత పెరిగేది. పర్సంటేజీ విషయంలో చాంబర్‌ ముందు ఆందోళనలు చేశాం. ఎంతోమంది చాంబర్‌ అధ్యక్షులకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో ‘హరి హరి వీరమల్లు’కు లింక్‌ పెట్టడం సరికాదు. నేడు సింగిల్‌ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమైంది. కొందరు కార్పొరేట్‌ వ్యవస్థకు వంత పాడుతున్నారు. సింగిల్‌ థియేటర్లు దేవాలయాల్లాంటివి. ఇప్పుడు ఇవి కల్యాణ మండపాలవుతున్నాయి. పర్సంటేజీని బతికించి నిర్మాతలను కాపాడాలి’ అని అన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 03:38 AM