ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద కూడా లేని తెలుగు చిత్ర పరిశ్రమ

ABN , Publish Date - May 25 , 2025 | 03:54 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే - తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత...

  • రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చినందుకు పవన్‌ కృతజ్ఞతలు

  • ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవు.. సినిమా సంఘాల ప్రతినిధులు రావాల్సిందే

  • థియేటర్ల బంద్‌పై ఘాటుగా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే - తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా సీఎం చంద్రబాబును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారైనా మర్యాదపూర్వకంగా కలిశారా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగు చిత్ర పరిశ్రమను, అగ్రనటులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇబ్బంది పెట్టిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్‌ అసోసియేషన్‌ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయని ఆయన గుర్తు చేశారు. పరిశ్రమ ఇచ్చిన రిటన్‌ గిఫ్ట్‌ను తను తగిన విధంగానే స్వీకరిస్తున్నాని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ రిటర్న్‌ గిఫ్ట్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. జూన్‌ ఒకటినుంచి థియేటర్ల బంద్‌ లేదని ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు వెల్లడించిన కొద్ది గంటలకే పవన్‌కల్యాణ్‌ ఈ ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఆ ఇబ్బందుల్ని మరచిపోయారా?

’’రూ.కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిళ్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా సృష్టంగా చెప్పాయి. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది, కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్లు దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా..? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ చెప్పిన విధంగానే, కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డ వారు ఇబ్బందిపడకూడదు అనేది కూటమి ప్రభుత్వం విధానం. తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్‌ ధర పెంచమని కోరడం ఎందుకు..? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో సృష్టంగా చర్చించమని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. దిల్‌రాజు, అల్లు అరవింద్‌, .సురేశ్‌ బాబు, సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్‌, నవీన్‌ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికి ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్‌ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి ఆర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది’’ ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం పేర్కొంది.


సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ..

ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని పవన్‌ ఆలోచన చేశారు. దీనిపై సీఎంతో చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్‌ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ పాలసీని ప్రకటిస్తారు.


థియేటర్ల ఆదాయంపై ఆరా

పవన్‌ కల్యాణ్‌ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికే కొన్ని చర్చలు చేశారు. ఇందులో పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా వారు పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి. తదితర అంశాలను చర్చించారు. థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా...? కొన్ని చిత్రాలకు టిక్కెటు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా..? లేదా..? అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైన ఈ సందర్భంగా చర్చించారు. టికెట్‌ సేల్‌కి, వచ్చే పన్నుకి అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో మల్టీప్లెక్సులు ఎన్ని ఉన్నాయి..?

రాష్ట్రంలో మల్టీప్లెక్సు స్థాయి సినిమా హాల్స్‌ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను ప్రభుత్వం నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్‌ థియేటర్లను కూడా రెండు, మూడు స్ర్కీన్స్‌గా విభజించి మల్టీప్లెక్సు విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్‌ ధరలు, సింగిల్‌ థియేటర్‌ టికెట్‌ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా..? కౌంటర్‌లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీపెక్స్‌ల నిర్వహణ వాటిలోని టికెట్‌ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టిసారిస్తారు.


నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమగా అభివృద్ధి...

కాంప్రహెన్సివ్‌ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ పాలసీ ద్వారా రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకూ 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల, ఆధునాతన సాంకేతిక వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారు. పరిశ్రమహోదా కల్పించడంతో పాటు యువతలోనూ, ఇప్పటికే చిత్ర రంగంలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం - అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియమ్స్‌ లాంటివి ఆంధ్రప్రదేశ్‌లో విరివిగా నిర్వహిస్తారు. సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్‌ వరకూ ఉండే విభాగాల్లో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే, పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుంది. ఈ దిశగానే పవన్‌ కల్యాణ్‌ ఆలోచన చేశారు. కాంప్రహెన్సివ్‌ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ పాలసీ ద్వారా ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.

అమరావతి, (ఆంధ్రజ్యోతి)

Updated Date - May 25 , 2025 | 03:54 AM