సినిమా అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:14 AM

నితిన్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ‘కాంతార’ ఫేమ్‌ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్‌, లయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. జూలై 4న విడుదలవుతోంది...

నితిన్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ‘కాంతార’ ఫేమ్‌ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్‌, లయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. జూలై 4న విడుదలవుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో సరికొత్త స్ర్కీన్‌ ప్లేను చూస్తారు. తన కోసం కాకుండా సినిమా గురించి ఆలోచించే వ్యక్తి నితిన్‌. నేను, నితిన్‌, దిల్‌రాజు.. పవన్‌కల్యాణ్‌ గారి అభిమానులం. అందుకే ఈ సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్‌ పెట్టాం’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా మీ అందర్నీ తప్పక సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ఈ సినిమా గురించి చెప్పను. జూలై 4న సినిమా మాట్లాడుతుంది. చిత్రం ఘనవిజయం సాధిస్తుంది’’ అని నితిన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుతం సంచలనంగా మారాయి.

నితిన్‌, శ్రీరామ్‌ వేణు సపోర్ట్‌ చేశారు

‘‘ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కేవలం నాలుగైదు మాత్రమే ఆదరణ పొందాయి. దీన్ని బట్టి థియేట్రికల్‌గా సినిమాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘తమ్ముడు’ సినిమా షూటింగ్‌ ఎక్కువ రోజులు జరగడంతో బడ్జెట్‌ పెరిగింది. ఈ విషయం దర్శకుడు వేణుకు చెప్పా. ‘అద్భుతమైన సౌండింగ్‌, ఉన్నత స్థాయి విజువల్స్‌ ఉన్న అవుట్‌పుట్‌ కోసమే బడ్జెట్‌ పెరిగింది. ఈ సినిమాకు ఇప్పటివరకూ ఇంత తీసుకున్నా. ఇక నుంచి ఒక్క రూపాయీ తీసుకోను. సినిమా విడుదలై హిట్‌ అయ్యాక పారితోషికం ఇవ్వండి’ అని అన్నారు. నా 22 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి దర్శకుడిని నేను చూడలేదు. అలాగే, నితిన్‌ కూడా పారితోషికం విషయంలో చాలా రాజీ పడ్డారు. ‘ఎంత వీలైతే అంతే ఇవ్వండి’ అని సపోర్ట్‌గా మాట్లాడారు. నిర్మాత పరిస్థితి తెలుసుకుని దర్శకుడు, హీరో ఇలా వ్యవహరించడం గొప్ప విషయం. ఇలా హీరో, దర్శకుడు నిర్మాతలకు మద్దతు ఇస్తూ ఓ కొత్త ఒరవడిని తీసుకురావాలి’’.


3-Cj.jpg

డబ్బులు పెట్టి వ్యూస్‌ కొనొద్దు

‘‘తమ్ముడు’ సినిమా ట్రైలర్‌కు ఒరిజినల్‌గా ఎన్ని వ్యూస్‌ వస్తాయో అన్నే చెప్పాలనుకుంటున్నాం. ఇన్ని మిలియన్స్‌, అన్ని మిలియన్స్‌ అనే ప్రచారం కోసం డబ్బులు పెట్టి వ్యూస్‌ కొనొద్దని, ప్రేక్షకుల నుంచి నిజంగా వచ్చిన వ్యూస్‌ మాత్రమే కనిపించాలని పీఆర్‌ టీమ్‌కు చెప్పా. అప్పుడు గాని టీజర్‌, పాటలు ప్రేక్షకులకు ఎంతగా చేరాయో తెలియదు. సినిమా రీచ్‌ ఎలా ఉందో అర్థం అవుతుంది. ఈ విషయంలో నేను ముందడుగు వేశా. కష్టమైనా ముందుకెళ్లాల్సిందే’’.

పవన్‌కల్యాణ్‌ ఆదర్శం

‘‘ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ మధ్య థియేటర్లకు ప్రేక్షకులను ఎలా తిరిగి తీసుకురావాలో కొన్ని సూచనలు చేశారు. ఆయన చెప్పిన విషయాలు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయి. వాటిని పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన సూచనలను నిర్మాతలంతా పాటించాలి. ‘తమ్ముడు’ చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగను. ఇకపై తెలంగాణలో టికెట్ల ధర పెంచడం అంటూ ఉండదు. టికెట్ల ధరలు, తినుబండారాల ధరలు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. ఈ విషయాలను తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించాం. పవన్‌గారి సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాను’’.

Updated Date - Jun 12 , 2025 | 06:14 AM