Kamal Haasan: థగ్‌లైఫ్‌ కమల్‌హాసన్‌ పారితోషికం ఎంత

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:33 AM

చెన్నైలో జరిగిన ‘థగ్‌లైఫ్‌’ ఆడియో వేడుకలో కన్నడ భాష గురించి కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే. దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల....

చెన్నైలో జరిగిన ‘థగ్‌లైఫ్‌’ ఆడియో వేడుకలో కన్నడ భాష గురించి కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే. దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు హీరో, చిత్ర నిర్మాతల్లో ఒకరైన కమల్‌హాసన్‌. ఈ విషయాన్ని ఆయన హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్‌ ఏ మాత్రం తగ్గట్లేదు. ‘నాయకుడు’ సినిమా తర్వాత 38 ఏళ్లకు కమల్‌ హాసన్‌, మణిరత్నం కలయికలో తెరకెక్కిన చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో హింట్‌ ఇచ్చాయి. దీంతో సినిమాను తొలిరోజే చూడడానికి సిద్ధమవుతున్నారు సినీ ప్రియులు. అడ్యాన్స్‌ బుకింగ్స్‌లో జోరు చూపిస్తోందీ చిత్రం. ఆన్‌లైన్‌లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే ఈ ఏడాదిలో ఇంత వరకూ వచ్చిన సినిమాల కంటే ‘థగ్‌లైఫ్‌’ అత్యధిక ఓపెనింగ్స్‌ను తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు ట్రేడ్‌ పండితులు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్‌, నటీనటుల పారితోషికాల వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


బడ్జెట్‌.. నటీనటుల పారితోషికాలు

కమల్‌హాసన్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర బడ్జెట్‌ దాదాపు రూ.300 కోట్లు అని తెలుస్తోంది. ఈ చిత్రానికి వారిద్దరూ ప్రత్యేకంగా పారితోషికాలు తీసుకోలేదు. ఈ సినిమా విడుదల తర్వాత వచ్చిన లాభాల్లో వాటాను పంచుకోనున్నారు. శింబు రూ.40 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారని తెలిసింది. త్రిష రూ.12 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఇది ఇంతకు ముందు ఆమె నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రం కంటే మూడింతలు ఎక్కువని టాక్‌. అలాగే, ఇందులో కీలక పాత్రలు పోషించిన జోజు జార్జ్‌, అశోక్‌ సెల్వన్‌, అభిరామి కూడా మంచి మొత్తాన్నే అందుకున్నారట. ఈ గ్యాంగ్‌స్టర్‌ థ్రిల్లర్‌ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ ద్వారా సుధాకర్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు.


Updated Date - Jun 04 , 2025 | 06:14 AM