ధనుష్‌ నటనకు జాతీయ అవార్డు వస్తుంది

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:34 AM

నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్మోహన్‌ నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా, చెన్నైలో ఆడియో వేడుక ...

నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్మోహన్‌ నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా, చెన్నైలో ఆడియో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘ఇదో అద్భుతమైన చిత్రం. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. నాగార్జున, ధను్‌షల నటన నెక్స్ట్‌ లెవెల్‌లో ఉంటుంది. ధనుష్‌ ఆల్‌రౌండర్‌. ఈ చిత్రంలో ఆయన నటనకు జాతీయ అవార్డు వస్తుంది’’ అని అన్నారు. ‘‘సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. శేఖర్‌ కమ్ముల అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. రజనీకాంత్‌తో నేను నటించిన ‘కూలీ’ సినిమా మీ అందరి ఊహలకు మించి ఉండబోతోంది’’ అని నాగార్జున చెప్పారు. ‘‘శేఖర్‌ కమ్ముల స్వచ్ఛమైన మనసు ఉన్న వ్యక్తి. ఇందులో చేసిన పాత్ర నాకెంతో ప్రత్యేకం’’ అని ధనుష్‌ తెలిపారు.


ఎంత దుష్ప్రచారం చేస్తారో చేస్కోండి

తనపై వస్తున్న దుష్ప్రచారాలపై ధనుష్‌ ఈ సందర్భంగా స్పందించారు. ‘‘నేనెప్పుడూ నా బెస్ట్‌ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాను. నాపై, నా సినిమాలపై ఎంతగా దుష్ప్రచారం చేస్తారో చేసుకోండి. నా సినిమాల విడుదలకు ముందు ప్రతిసారి ఏదో ఒక విషయంలో కుట్రలు పన్నుతూనే ఉంటారు. అయినా ఆ ప్రయత్నాలు నన్నేమీ చేయలేవు. నా అభిమానులు 23 ఏళ్లుగా నా వెన్నంటే ఉన్నారు. ఇలాంటి సర్కస్‌లు చేయడం మానుకోండి. ఎవరెంత దుష్ప్రచారం చేసినా అభిమానులు నాతోనే ఉంటారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 04:34 AM