Tollywood Celebrities: మీ వెంట మేమున్నాం
ABN , Publish Date - May 10 , 2025 | 06:25 AM
పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి సినీ ప్రముఖుల మద్దతు వెల్లువెత్తింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, మంచు విష్ణు, సాయి ధరమ్ తేజ్ లు సైన్యానికి మద్దతు ప్రకటించారు.
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో దాడులకు తెగబడడం, వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టడం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు భారత సైన్యంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధైర్యంగా ముందుకు సాగండి.. మీ వెంట మేమున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు సాయుధ దళాలకు సాయం చేసేందుకు విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. తన రౌడీ బ్రాండ్ దుస్తులు వారికి అందించనున్నట్లు ప్రకటించారు.
ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్దతిచ్చే వారిని యుద్ధాన్ని కాంక్షించే వారిగా పేర్కొనొద్దు. దేశ భద్రత, న్యాయం కోసం ఆరాటపడే పౌరులు వారు. దూకుడు ధోరణి, అత్యవసర ఆత్మరక్షణకు మధ్య చాలా నైతిక భేదం ఉంటుంది. కుట్రపూరితంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, దానికి ప్రతీకారం తీర్చుకోవడం బాధ్యతే అవుతుంది తప్ప అవకాశం కాదు. శాంతిని కోరుకోవడమంటే జరిగిన హానిని మౌనంగా అంగీకరించడం కాదు
- రష్మిక మందన్న
భారత సైన్యానికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మన రక్షణ దళాలు ధైర్యంగా సాగుతూ, శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాలి.
- సాయి దుర్గాతేజ్
దీన్ని వాళ్లు ప్రారంభించారు. మనం ముగిస్తాం. భారత సాయుధ దళాల కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాం
- మంచు విష్ణు
శత్రుదేశం జమ్మూను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి
- కంగనా రనౌత్