ఏపీ సీఎం చంద్రబాబుతో 15న సినీ ప్రముఖుల భేటీ

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:55 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ నెల 15న సమావేశం కాబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో ఆదివారం...

  • పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో ఉండవల్లిలోని సీఎం నివాసానికి 30మంది

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ నెల 15న సమావేశం కాబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4గంటలకు చిత్ర పరిశ్రమ తరపున దాదాపు 30మంది ప్రముఖులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి, సినిమా థియేటర్ల నిర్వహణ, చిత్ర పరిశ్రమలోని సమస్యలు, తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా టాలీవుడ్‌ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలవక పోవడంపై పవన్‌ అంతకుముందు అసహనం వ్యక్తం చేశారు. ‘రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌’ అంటూ డిప్యూటీ సీఎంచేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం సృష్టించాయి. సినీ నిర్మాతలు కేవలం తమ సినిమాల విడుదల సమయంలో టికెట్‌ ధరల పెంపునకు మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని, సినీ పరిశ్రమ అభివృద్ధికి సంఘటితంగా ప్రభుత్వం వద్దకు రావట్లేదన్నారు.


ఇకపై వ్యక్తులు ఇచ్చే వినతుల్ని పట్టించుకోబోమని, అసోసియేషన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని కూడా పవన్‌ ఆ సమయంలో స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో పలువురు చిత్ర ప్రముఖులు పవన్‌ కల్యాణ్‌ను సంప్రదించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారు. ముఖ్యమంత్రితో చర్చించి సినీ పరిశ్రమ అభివృద్ధికి అందరం పాటుపడదాం అని పవన్‌ సూచించడంతో చలన చిత్ర రంగ ప్రముఖులు చంద్రబాబుతో ఆదివారం భేటీ కానున్నారు.

అమరావతి, (ఆంధ్రజ్యోతి)


Updated Date - Jun 13 , 2025 | 01:55 AM