Producer Namit Malhotra: వాళ్లకు నచ్చకుంటే ఓటమిగా భావిస్తా
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:46 AM
సాయిపల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూ. 4 వేల కోట్లతో..
సాయిపల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూ. 4 వేల కోట్లతో నిర్మిస్తున్నట్లు ప్రకటించి అందరూ నోరెళ్లబెట్టెలా చేశారు నిర్మాత నమిత్ మల్హోత్రా. ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రామాయణ’ను కేవలం భారతీయ ప్రేక్షకుల కోసమే తీయట్లేదు. ప్రపంచ సినీ ప్రేక్షకులందరూ చూసేలా తీస్తున్న చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ను మొదలుపెట్టినప్పుడే గ్లోబల్ ఫిల్మ్గా తీర్చిదిద్దేలా.. మన ఇతిహాసపు గొప్పతనాన్ని పాశ్చాత్యులకూ తెలియజెప్పేలా ఉండాలని మా తపన. ఇది విదేశీయులకు నచ్చకుంటే, అది నా ఓటమిగా, అవమానంగా భావిస్తాను. ప్రాంతీయ హద్దులను, భాషా సరిహద్దులను చెరిపేసే చిత్రం తీయాలని మా ప్రయత్నం. అలాగే నాస్తికులకూ చేరువయ్యేలా ఈ చిత్రం ఉంటుంది. ‘గ్లాడియేటర్’, ‘అవతార్’ చిత్రాల స్థాయిలో ‘రామాయణ’ ఉండనుంది’ అని అన్నారు. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండోది 2027 దీపావళికి రానుంది. అయితే రామాయణం స్ఫూర్తితో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ ఘోర వైఫల్యంతో.. మరోసారి ఇతిహాసాల్ని తెరపై చూడడానికి ప్రేక్షకులు అనాసక్తి చూపిస్తున్న నేపథ్యంలో నమిత్ మల్హోత్రా తన ప్రాజెక్ట్పై చూపిస్తున్న నమ్మకం.. ఏకంగా ప్రపంచ స్థాయి సినిమాలను సవాలు చేస్తున్న తీరు ఈ సినిమాపై అంచనాలను క్రమంగా పెంచుతోంది.