Lokesh Kanagaraj: ఆమిర్‌తో సూపర్‌హీరో జానర్‌లో..

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:22 PM

లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న దర్శకుడు. ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ను నెలకొల్పి కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న దర్శకుడు. ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ను నెలకొల్పి కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఆయన గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆయన బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో ఓ సినిమా చేయనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) . ప్రస్తుతం ఆయన ‘సితారే జమీన్‌ పర్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌తో తాను సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ‘లోకేశ్‌ కనగరాజ్‌తో మీరు సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత?’ అని రిపోర్టర్‌ ప్రశ్నించగా..

‘‘అవును నిజమే.. మేమిద్దరం ఓ సినిమా చేస్తున్నాం. ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాం. సూపర్‌హీరో జానర్‌లో ఈ సినిమా ఉంటుంది. భారీ స్థాయిలో యాక్షన్‌ మూవీగా దీనిని తీర్చిదిదాలనుకుంటున్నాం. వచ్చే ఏడాది జూన్‌ తర్వాత ఈ సినిమాను సెట్స్‌ మీదకి తీసుకెళ్లాలనుకుంటున్నాం.  ఇంతకు మించి ఈ సినిమా గురించి ఎక్కువగా ఏమీ చెప్పలేను. రెండేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుకుందాం చర్చించుకుందాం’’ అని ఆమిర్‌ అన్నారు. అంతే కాదు ‘పీకే 2’ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘‘పీకే 2’ పట్టాలెక్కుతుందనేది కేవలం ప్రచారం మాత్రమే. ఆ ప్రాజెక్ట్‌ గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’పై సినిమా చేయడానికి సన్నద్థమవుతున్నాం. తప్పకుండా సినిమా చేస్తాం. రాజ్‌ కుమార్‌ హిరాణీ, నేను ఆ పనుల్లోనే ఉన్నాం. ‘మహాభారతం’పై సినిమా చేయాలనేది నా 25 ఏళ్ల డ్రీమ్‌. అది కేవలం సినిమా మాత్రమే కాదు. దానిని ఒక యజ్ఞంలా ఎంతో క్రమశిక్షణతో చేయాలి. అందుకు అనుగుణంగా సన్నాహాలు జరుగుతున్నాయి. నా కలయుయ ఎంత వరకూ నెరవేరుతుందో చూడాలి’’ అని అన్నారు.

 

Updated Date - Jun 05 , 2025 | 05:25 PM