Housefull 5: అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 5.. ఆ వెంకీ మూవీని మొత్తం కాపీ కొట్టారుగా!
ABN , Publish Date - May 27 , 2025 | 04:17 PM
అక్షయ్ కుమార్ మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ మూవీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
అక్షయ్ కుమార్ మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యాడు. ఇండియా బిగ్గెస్ట్ కామెడీ ఫ్రాంచైజీగా గతంలో నాలుగు భాగాలుగా వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందిన హౌస్ ఫుల్ (House full 5) చిత్రాల సిరీస్లో మరో సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది. సాజిద్ నడియావాలా (Sajid Nadiadwala's) నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని (Tarun mansukhani) దర్శకత్వం వహించారు. గతంలో ఈ సిరీస్ లో వచ్చిన హౌస్ ఫుల్1, 2 చిత్రాలకు సాజిద్ ఖాన్, పార్ట్ 3కి సాజిద్ సమ్జి, పర్హాద్ సమ్జి, పార్ట్ 4కి పర్హాద్ సమ్జి దర్శకత్వం వహించగా ఈ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించడమే కాక ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందించాయి. ముఖ్యంగా నాలుగో భాగంలో బాల బాల అనే పాట ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ తీసుకు వచ్చింది.
ఇక.. మొదటి నాలుగు భాగాలలో నటించిన అక్షయ్ కుమార్ (Akshay Kumar), రితేశ్ దేశ్ ముఖ్ (Riteish Deshmukh) లతో పాటు సగం బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటించడం విశేషం. అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), జాకీ ష్రాఫ్ (Jackie Shroff), నానా పటేకర్ (Nana Patekar), సంజయ్ దత్ (Sanjay Dutt), సోనమ్ బజ్వా (Sonam Bajwa), జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), నగ్రీస్ ఫక్రీ (Nargis Fakhri), చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్ (Fardeen Khan), చుంకీ పాండే, శ్రేయస్ తల్పడే (Shreyas Talpade), డినో మోరియా, జానీ లీవర్ (Johnny Lever) ఇంకా చాలామంది ఈ సినిమాలో నటించడం విశేషం. అయితే 2023లోనే ప్రారంభించిన ఈ సినిమాను 2024 దీపావళికి విడుదల చేయనున్నట్లు హీరోలు, మేకర్స్ ప్రకటించినప్పటికీ సినిమాలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ తదితర కారణాల వళ్ల ఓ ఏడాది వాయిదా పడింది. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2025 జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఈక్రమంలో మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ను గమనిస్తే పాత చిత్రాలను మించి ఆరంభం నుంచి చివరి వరకు నాన్స్టాప్ కామెడీ తప్పా మరోటి లేదనిపించేలా ఉంది. సినిమా అసాంతం క్రూయిజ్ షిప్లోనే సాగనుంది. ఓ బిలియనీర్ తన ఆస్తిని తన వారసులకు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈనేపథ్యంలో నాలుగైదు జంటలు ఆ వారసులం మేమే అంటూ ఆ షిప్లోకి వచ్చి నానా హంగామా చేస్తుంటారు. సడన్గా ఓరోజు రాత్రి హత్య జరుగుతుం. ఆ మర్డర్ ఎవరు చేశారో తెలియక అంతా అగమ్య గోచరంగా ఉంటుంది. అంతా అనుమానితులుగానే ఉంటారు. ఈలోపు కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ అనేక మలుపులు తిరుగుతూ హంతకుడిని పట్టుకున్నారా, ఆ ఆస్తి ఎవరికి దక్కింది అనే కథకథనాలతో సినిమా సాగనుంది. ఇదిలాఉంటే ఈ సినిమా స్టోరీని గమనిస్తే.. మూడేండ్ల క్రితం వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఎఫ్3 సినిమాను పోలి ఉండడం గమనార్హం. అందులోనూ హీరోలు ఇద్దరు ఆస్తి కోసం ఓ ఫ్యాలెస్కు వెళ్లడం వారసుడిగా నిరూపించుకునేందుకు చేసే సాహసాల నేపథ్యంలోనే సినిమా ఉంటుంది.