Rashmika Mandanna: అరుదైన ఘనత సాధించిన నేషనల్ క్రష్ రష్మిక

ABN , Publish Date - Feb 16 , 2024 | 10:22 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఇంకో అరుదైన ఘనత సాధించింది. ఫోర్బ్స్ ఇండియా వాళ్ళు ప్రతిభావంతులైన వ్యక్తులని ప్రచురించే జాబితాలో రష్మిక మందన్న పేరు కూడా ఉండటం ఆమె ఈమధ్య కాలంలో సాధించిన ఘనత అని చెప్పవచ్చు.

Rashmika Mandanna: అరుదైన ఘనత సాధించిన నేషనల్ క్రష్ రష్మిక
Rashmika Mandanna

కన్నడ అమ్మాయి అయిన రష్మిక మందన్న తెలుగు సినిమాలు చేసాక పెద్ద స్టార్ అయింది. మొదటగా 'చలో' అనే సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసి తరువాత 'గీత గోవిందం' సినిమా విజయంతో ఒక్కసారిగా అగ్ర నటీమణుల జాబితాలోకి చేరిపోయింది. రష్మికని తెలుగు అమ్మాయినే అందరూ అనుకునేట్టుగా వరసగా తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగు మాట్లాడుతూ వచ్చింది. అలా వచ్చిన అవకాశాల్లో అల్లు అర్జున్ పక్కన నటించిన 'పుష్ప' సినిమా ఒకటి. ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక మమేకమై పోవటమే కాకుండా, చిత్తూరు యాస అద్భుతంగా మాట్లాడి అందరినీ అబ్బుర పరిచింది.

ఎక్కడికి వెళ్లిన రష్మికని అసలు పేరుతో కాకుండా శ్రీవల్లి అనే పిలుస్తూ వచ్చారు ఆమె అభిమానులు. ఆ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద విజయం సాధించింది. శ్రీవల్లి కాస్తా 'నేషనల్ క్రష్' అయిపొయింది. ఇంకేముందు హిందీలో కూడా వరసగా ఆమెకి సినిమాలు రావటం మొదలుపెట్టాయి. ఒక్క హిందీలోనే కాకుండా అటు తమిళంలో విజయ్ లాంటి పెద్ద స్టార్స్ పక్కన కూడా అవకాశాలు వచ్చాయి.

forbesindiarashmika.jpg

హిందీలో రణబీర్ కపూర్ కథానాయకుడిగా చేసిన 'యానిమల్' సినిమాలో రష్మిక కథానాయికగా చేసింది. సందీప్ వంగా ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి రష్మిక మందన్న కెరీర్ ని కొత్త మలుపు తిప్పింది. అంతవరకు నేషనల్ క్రష్ అని పిలుస్తున్న రష్మిక ఈ సినిమా విజయం తరువాత ఎక్కడికో ఆమె పేరు వెళ్ళింది, అంటే అంతలా ఆమెకి పేరు తెచ్చి పెట్టింది ఈ 'యానిమల్' సినిమా.

Rashmika.jpg

రష్మిక ఏ సినిమా చేసిన అందులో పాటలు పెద్ద హిట్ అవుతూ వస్తున్నాయి. 'పుష్ప' సినిమాలో పాటలు గానీ, విజయ్ తో చేసిన 'వారిసు' తమిళ సినిమా పాటలు గానీ ఈమధ్య చేసిన 'యానిమల్' పాటలు కానీ పెద్ద విజయం సాధించాయి. నేషనల్ క్రష్ నుండి ఇంటర్ నేషనల్ క్రష్ అయిన ఇప్పుడు రష్మీక కి మరో అరుదైన ఘనత సంపాదించింది.

వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ అయిన ఫోర్బ్స్ ఇండియా తన మ్యాగజైన్ లో రష్మికపై ఒక ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. '30 అండర్ 30' అనే కేటగిరీలో అత్యంత ప్రతిభావంతులైన యువ వ్యాపారవేత్తలు, ఇతర రంగాలకు చెందిన వారు, సమాజంపై ఎక్కువ ప్రభావం చూపినవారు 30 సంవత్సరాల లోపు వ్యక్తులను ఎంపికచేసి వారి గురించి ప్రచురిస్తారు. అలా ఎంపిక చేసిన వారి జాబితాలో సినిమా పరిశ్రమ నుండి రష్మిక మందన్న కూడా ఉండటం ఆసక్తికరం.

Rashmika.jpg

ఇప్పుడు రష్మిక చేతిలో పెద్ద పెద్ద సినిమాలు వున్నాయి. అల్లు అర్జున్ తో నటిస్తున్న 'పుష్ప 2' ఈ సంవత్సరం ఆగస్టు 15న విడుదలవుతోంది. ఇది కాకుండా హిందీ, తమిళ, తెలుగు సినిమాలు చాలా వున్నాయి. రష్మిక మందన్న ఇప్పుడు దక్షిణాది నుండి జాతీయ స్థాయికి ఎదిగిన నటి, భారతదేశంలో వున్న అగ్ర నటీమణుల్లో రష్మిక మందన్న కూడా ఒకరు. ఆమె ఈ ఫోర్బ్స్ ఇండియా పత్రికలో ఎంపికవడం ఆమె పేరు ప్రఖ్యాతులు ఇంకా ఎక్కువ అయినట్టే!

Updated Date - Feb 16 , 2024 | 10:22 AM