ఆసక్తికరంగా వున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్

ABN, Publish Date - Jan 24 , 2024 | 12:36 PM

చిన్న చిన్న పాత్రలతో కమెడియన్ గా మొదలెట్టి ఇప్పుడు కథానాయకుడిగా కూడా సినిమాలు చేస్తున్న సుహాస్ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే నూతన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని దర్శకుడు. ఈరోజు ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది, ఇందులో కామెడీ, చిన్న క్రైమ్, వూర్లో వుండే చిన్న చిన్న గొడవలు కలగలిపి ఒక కథగా మలిచినట్టుగా తెలుస్తోంది. సెలూన్ షాపు నడిపే సుహాస్ ఆ వూర్లో ఏమి జరిగినా అన్నిటిని తనమీదే వేసుకొని ఎలా చిక్కుల్లో పడ్డాడు, వాటినుంచి ఎలా బయటపడ్డాడు అనే ఇతివృత్తంగా కనపడుతోంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఇంతకు ముందు సుహాస్ 'కలర్ ఫోటో' అనే చిత్రంలో కథానాయకుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు, జాతీయ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. ఆ తరువాత 'రైటర్ పద్మభూషణ్', 'మను చరిత్ర' అనే రెండు సినిమాలో నటించాడు. ఇప్పుడు ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' తో ఫిబ్రవరి 2న వస్తున్నాడు. బన్నీవాస్, వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు, నిర్మాత ధీరజ్ మొగిలినేని. సుహాస్ సరసన శివాని నగరం అనే అమ్మాయి కథానాయికగా చేస్తుండగా, గోపరాజు రమణ ఇంకో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కొత్త నటులకి ఈ సినిమా ద్వారా అవకాశం కలిపించినట్టుగా కనపడుతోంది.

Updated at - Jan 24 , 2024 | 12:37 PM