ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్లయితే, చిరంజీవి మూడో కన్ను: వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Jan 27 , 2024 | 10:29 AM

నేను కాలేజీలో చదువుతున్నప్పుడు వెంకయ్య నాయుడు గారు మా విద్యార్ధి నాయకుడు అంటూ చిరంజీవి, తెలుగు సినిమా రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్ళు అయితే చిరంజీవి మూడో కన్ను అంటూ చిరంజీవి గురించి వెంకయ్య నాయుడు ఇలా ఒకరినొకరు అభినందిచుకొని పద్మ విభూషణ్ అందుకున్న ఈ ఇద్దరూ పాత గుర్తులను నెమరువేసుకున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్లయితే, చిరంజీవి మూడో కన్ను: వెంకయ్య నాయుడు
The two Padma Vibhushan award recipients Venkaiah Naidu and Chiranjeevi

ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మవిభూషణ్‌ లభించటం చాలా అరుదుగా వస్తుంది, అందులోకి అది అందుకున్న వారిద్దరూ మంచి స్నేహితులు అవటం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ఆ ఇద్దరూ ప్రజలతో ఎక్కువగా మమేకం అవటం, సమాజాభివృద్ధి కోసం ఇద్దరూ పాటుపడటం, పనిచేసినవారు కావటం ఇంకా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు అలాంటి సంఘటన చోటు చేసుకుంది. పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీతలు అయిన మాజీ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవిలు శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు.

chiranjeeviandvenkaiah.jpg

ఇద్దరికీ ఈ సంవత్సరం గణ తంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ అత్యంత ఆప్తులు కావటం, అందుకని ఒకరికొకరు కలుసుకొని అభినందనలు తెలుపుకున్నారు. 'జైఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు’ అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

chiranjeevivenkaiah.jpg

ఆ తర్వాత తాను సినిమాలలోకి వచ్చానని, ఆయన రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారయని మెగాస్టార్‌ వెంకయ్యనాయుడు గురించి చెప్పుకొచ్చారు. అలాగే తామిద్దరూ పార్లమెంట్‌లో కొలిగ్స్‌గా ఉన్నామని, అప్పుడు అనేక విషయాలు ఆయనను అడిగి తెలుసుకొనేవాడిని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. 'సమాచార విషయంలో ఆయన నాకు స్ఫూర్తి అని వెల్లడించారు చిరంజీవి. వెంకయ్యనాయుడు గారు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని ఆయనను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. వెంకయ్యనాయుడు గారితో పాటుగా తనకు కూడా పద్మవిభూషణ్‌ రావటంతో తన ఆనందం ద్విగిణికృతమయిందన్నారు. ఇద్దరు తెలుగువాళ్లం, స్నేహితులం. మాకు ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్‌ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం’’ అన్నారు.

chiranjeeviandvenkaiahnaidu.jpg

చిరంజీవి గురించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సినిమా రంగానికి చిరంజీవి మూడో కన్ను అని చెప్పారు. 'తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ రెండు కళ్లు అయితే, చిరంజీవి మూడో కన్ను' అని వెంకయ్యనాయుడు గారు చిరంజీవిని అభివర్ణించారు. 'ఈ అవార్డు రావటానికి అన్ని అర్ఞతలు మీకు ఉన్నాయి. మీరు కష్టపడి ఒకో అడుగు వేసుకుంటూ, ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగారు’ అని వెంకయ్యనాయుడు మెగాస్టార్‌ను ప్రశంసించారు. సరైన సమయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అని మెగాస్టార్‌ను ప్రశంసించి సత్కరించారు.

Updated Date - Jan 27 , 2024 | 10:29 AM