Purushothamudu: ఐ ఫీస్ట్ లాంటి సినిమా 

ABN , Publish Date - May 16 , 2024 | 03:56 PM

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పురుషోత్తముడు'. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు.

Purushothamudu: ఐ ఫీస్ట్ లాంటి సినిమా 

రాజ్ తరుణ్(Raj tarun) హీరోగా నటిస్తున్న చిత్రం 'పురుషోత్తముడు' (Purushothamudu). శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న రామ్ భీమన  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ "చక్కని ప్రేమకథతో రూపొందిన చిత్రమిది.  డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు.జూన్ 6న పురుషోత్తముడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తాం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి'' అన్నారు


నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ "సినిమా నిర్మించాలని 30 ఏళ్ల కిందట అనుకున్నాను. పురుషోత్తముడు సినిమా కథను దర్శకుడు రామ్ భీమన గారు చెప్పగానే వెంటనే నచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. మా సినిమా వరకు పురుషోత్తముడు అంటే మా డైరెక్టర్ రామ్ భీమన. ఆయన ఈ సినిమానే జీవితంగా గడిపారు. యాక్సిడెంట్ జరిగినా షూటింగ్ కు వచ్చి అంతా చూసుకున్నారు. మా హీరోయిన్ ఫస్ట్ సినిమాకే ఇంత  డెడికేషన్ చూపించడం ఆశ్చర్యం వేసింది. 102 డిగ్రీల  జ్వరం ఉన్నా షూటింగ్ చేసింది. రాజ్ తరుణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం" అన్నారు.



దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ "ఒక సినిమా అనేక ఇబ్బందులు దాటుకుని రిలీజ్ వరకు రావడం సంతోషకరమైన విషయం. మా మూవీ టీజర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. అలాంటి టైమ్ లో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు..ఇద్దరు గంధర్వుల్లాంటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు వచ్చారు. నాకు వాళ్లు ఇంద్రుడు, చంద్రుడు. నిర్మాతలకు నాలుగు కథలు చెబితే మంచి టేస్ట్ తో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్లు సినిమాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. గోపీసుందర్, పీజీ విందా, మార్తాండ్ కె వెంకటేష్ ఇలా..ఒక్కొక్కరు మా టీమ్ కు యాడ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజ్ తరుణ్ తో పనిచేసి ఆయనకు ఫ్యాన్ అయ్యా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ హీరోయిన్ తో రాజ్ తరుణ్ కెమిస్ట్రీ కంటే సెట్ లో రాజ్ తరణ్ తో నా కెమిస్ట్రీ ఎక్కువగా ఉండేది. రాజ్ తరుణ్ గారిని కొత్తగా తెరపై ప్రెజెంట్ చేసే చిత్రమిది. మీకు ప్రామిస్ చేస్తున్నా పురుషోత్తముడుతో ఒక ఐ ఫీస్ట్ లాంటి సినిమాను చూడబోతున్నారు" అన్నారు.

Updated Date - May 16 , 2024 | 03:56 PM