Manjummel Boys: ఇలాంటి.. స్నేహితులు మ‌న‌ జీవితంలోనూ ఉండాలని కోరుకుంటారు

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:43 PM

మలయాళంలో 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

Manjummel Boys: ఇలాంటి.. స్నేహితులు మ‌న‌ జీవితంలోనూ ఉండాలని కోరుకుంటారు
Manjummel Boys

సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు ముందు ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను తీసుకువస్తోంది. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలిజ్ ఈవెంట్ ని నిర్వహించారు. నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, శశిధర్ రెడ్డి, నవీన్ యెర్నేని, నిరంజన్ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Manjummel Boys Movie Pre Release Event

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ట్రెమండస్ సక్సెస్ ని అందుకున్న మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) టీంకి అభినందనలు. తెలుగు రిలీజ్ కి ఆల్ ది బెస్ట్. మైత్రీ శశి గారు ఈ సినిమా రైట్స్ తీసుకున్నామని చెప్పారు. సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాన‌ని చెప్పాను. ఈ మధ్య మలయాళం చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిన ప్రేమలు, 'మంజుమ్మల్ బాయ్స్' చూశారా అని అడుగుతున్నారు. తెలుగులో కూడా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలని ఆదరిస్తే అటువంటి ధైర్యం మనకీ వస్తుంది. టీం అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

Manjummel Boys Movie Pre Release Event

యాక్టర్ శ్రీనాథ్ భాసి మాట్లాడుతూ.. మీ అందరి ఆదరణకు ధన్యవాదాలు. పాటలు, ట్రైలర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ చూడటానికి మేము ఆసక్తిగా ఎదురుచుస్తున్నాం’ అన్నారు. యాక్టర్ అరుణ్ కురియన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకని ఇంత ఘనంగా నిర్వహించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా అందరూ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’ అని కోరారు. విష్ణు రవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. మీరు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్ లోనే చూడండి, మైత్రీ మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు’ తెలిపారు


నిర్మాత శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేయడానికి హెల్ప్ చేసిన షాన్, అనుప్ లాల్ కి ధన్యవాదాలు. మొదటి రోజు ఈ సినిమా చూసిన వెంటనే సినిమాని తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. రవి గారు నవీన్ గారు ఈ సినిమాని ఇక్కడ గ్రాండ్ గా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇది బ్లాక్ బస్టర్ అని ముందే అనుకున్నాం. ఈ సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు. ఇది పది మంది బాల్య స్నేహితులకు సంబధించిన కథ. ఇలాంటి స్నేహితులు జీవితంలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. నా జీవితంలో రవి కూడా లాంటి గొప్ప స్నేహితుడు. నిరాశలో ఉన్న కాలంలో ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. ఈ రకంగా ఈ సినిమా నా మనుసుకి చాలా దగ్గరైయింది. ఏప్రిల్ 6న తెలుగులో సినిమా విడుదలౌతుంది. ఏప్రిల్ 5న ప్రిమియర్స్ కూడా వేస్తున్నాం. మలయాళం సినిమా పేయిడ్ ప్రిమియర్స్ వేయడం ఇదే తొలిసారి. ఇది బిగ్ ఎచీవ్మెంట్. ఇది డబ్బింగ్ సినిమాల కాకుండా స్ట్రయిట్ సినిమాలనే దాదాపు 300 వందల స్క్రీన్స్ లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం మాతో కలసి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా పెద్ద సినిమా. అందుకే ఎక్కడా రాజీ పడకుండా మైత్రీ సొంత సినిమాలానే చేశాం అంటూ.. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

Manjummel Boys Movie Pre Release Event

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఈ సినిమాని యుఎస్ లో చూశాను. ఎక్స్ ట్రార్డినరీ ఫిలిం. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ ఫిలిం. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బిగ్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరు ఇష్టపడతారు. విజువల్స్, మ్యూజిక్ ఎక్స్ ట్రార్డినరీ. ఏప్రిల్ 6న సినిమా రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్స్ కి వచ్చి చూడండి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు' అన్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. 'మంజుమ్మల్ బాయ్స్' (Manjummel Boys) టీంకు అభినందనలు. తెలుగు వెర్షన్ ని విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన షాన్ కు ధన్యవాదాలు. ఏప్రిల్ 6న సినిమా విడుదలౌతుంది. 5న స్పెషల్ ప్రిమియర్స్ వేస్తున్నాము. మలయాళంలానే తెలుగులో కూడా సినిమా పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాం అన్నారు. దర్శకుడు చిదంబరం మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు, మాకు ఇంత గొప్పగా స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు. అందరూ ఏప్రిల్ 6న థియేటర్స్ కి వచ్చి మంజుమ్మల్ బాయ్స్ ని చూడండి. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం' అన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 02:49 PM