Geetha Arts: పెద్దమ్మ దేవాలయ నిర్వాహణపై అల్లు ఎంటర్టైన్మెంట్స్ బిజినెస్ హెడ్ లేఖ 

ABN , Publish Date - May 03 , 2024 | 08:50 PM

జూబ్లీహిల్స్‌లో కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్వాహకులపై ఓ భక్తుడు ఫిర్యాదు చేస్తూ కార్యనిర్వాహణాధికారికి లేఖ రాశారు. గీతా ఆర్ట్స్‌(Geetha Arts), అల్లు అర్జున్ (Allu arjun) ఆఫీస్‌లో బిజినెస్‌ హెడ్‌గా పనిచేసే కాంతారావు అనే భక్తుడు దేవాలయంలో సదుపాయాల గురించి  లేఖ రాశారు.

Geetha Arts:  పెద్దమ్మ దేవాలయ నిర్వాహణపై అల్లు ఎంటర్టైన్మెంట్స్ బిజినెస్ హెడ్ లేఖ 

పెద్దమ్మతల్లి (Peddamma Temple) దేవాలయంలో నిర్వాహణ బాగోలేదు..


ఎండల్లో భక్తులకు కనీస వసతుల్లేవు..


ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది దురుసు ప్రవర్తన..


సాయం చేయడానికి సిద్ధమంటున్న దాతలు..

- భక్తుడు కాంతారావు ఫైర్ 

జూబ్లీహిల్స్‌లో కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్వాహకులపై ఓ భక్తుడు ఫిర్యాదు చేస్తూ కార్యనిర్వాహణాధికారికి లేఖ రాశారు. గీతా ఆర్ట్స్‌(Geetha Arts), అల్లు అర్జున్ (Allu arjun) ఆఫీస్‌లో బిజినెస్‌ హెడ్‌గా పనిచేసే కాంతారావు అనే భక్తుడు దేవాలయంలో సదుపాయాల గురించి  లేఖ రాశారు. వేసవి కారణంగా మండిపోతున్న ఎండల్లో భక్తులు ఇక్కట్లు పడుతున్నారని, కనీస సదుపాయాలు దేవాలయంలో ఏర్పాటు చేయలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంతారావు రాసిన లేఖలో ఏముందంటే...

గౌరవనీయులైన ఆలయ కార్యనిర్వాహణాధికారికి..


"నగరంలో పెద్దమ్మతల్లి చాలా ప్రసిద్థి చెందిన దేవత. ప్రతి ఒక్కరూ ఆమెను పూజిస్తారు. ఇటీవల నేను ఉదయం 10.30 గంటల సమయంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించాను. కారు పార్క్‌ చేసి గుడిలోకి నడుచుకుంటూ వెళ్లాను. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డాను. చాలా మంది మహిళలు, పిల్లలు ఆ ఎండలో నడవడానికి ఇబ్బంది పడటం నేను గమనించాను. గుడి దగ్గర్లో కొబ్బరి చాప ఉన్నప్పటికీ దానిపై కాస్త నీళ్లు చల్లి ఉంటే నడిచేందుకు అనువుగా ఉండేది. ఈ సమస్యలు మీ ముందు ఉంచడానికి కార్యాలయానికి రాగా, మీరు అందుబాటులో లేరని మీ సిబ్బంది కాస్త దురుసుగా చెప్పారు. నంబర్‌ కావాలని కోరగా చెప్పడానికి ఇష్టపడలేదు. 'మీరు పబ్లిక్‌ సర్వెంట్స్‌, దేవుని సేవకులు సమాచారం అడిగిన వారికి చెప్పాల్సిన బాధ్యత ఉంది’ అని మాట్లాడగా అప్పుడు మీ నంబర్‌ ఇచ్చారు. ఫోన్లో కూడా మీరు అందుబాటులో లేరు. దేవాలయ ఈవోగా మీరు భక్తుల పట్ల శ్రద్ద వహించాలి. వారి సౌకర్యం, భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలి. వేసవిలో ఇది ప్రాథమిక అవసరం. ఈ సమస్యను మాత్రమే హైలైట్‌ చేస్తున్నానని మీరు అనుకోవద్దు. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే నేను పరిష్కారాన్ని చెప్పగలను. దేవాలయం దగ్గర  కనీస ఏర్పాట్లు చేయడానికి సాయం అందించడానికి భక్తులు, పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. నడక మార్గంలో చల్లదనం కోసం తెల్లటి పెయింట్‌ వేయించడం, మ్యాట్‌లు వేయడం, వాటిని క్రమం తప్పకుండా నీరుతో తడుపుతూ ఉండే భక్తులకు ఎండ ఇబ్బందులు ఉండవు. మీకు మంచి బోర్డ్‌ మెంబర్స్‌ ఉన్నారు. మీ సిబ్బందిని భక్తులతో కాస్త గౌరవంగా వ్యవహరించమనండి. దయచేసి దీనిని భగవంతుని సేవగా భావించండి. వెంటనే భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని పేర్కొన్నారు.  

Updated Date - May 03 , 2024 | 08:57 PM