హీరోగా జబర్దస్త్ రాకింగ్ రాకేశ్.. తెలంగాణ తేజం పాట అవిష్కరించిన కేసీఆర్
ABN , Publish Date - Jun 01 , 2024 | 09:13 AM
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ ) సినిమాలో గోరేటి వెంకన్న రచించిన తెలంగాణ తేజం పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
![హీరోగా జబర్దస్త్ రాకింగ్ రాకేశ్.. తెలంగాణ తేజం పాట అవిష్కరించిన కేసీఆర్](https://media.chitrajyothy.com/media/2024/20240530/kcr_dcaff512ff.jpg)
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ (Jabardasth Rakesh) హీరోగా తెరకెక్కిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ ) సినిమాలోని తెలంగాణ తేజం (Telangana Tejam) పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుక్రవారం ఆవిష్కరించారు. గోరేటి వెంకన్న అద్భుతంగా రచించిన ఈ పాటని చరణ్ అర్జున్ (Charan Arjun) కంపోజ్ చేశారు. సింగర్ మను, కల్పన, గోరేటి వెంకన్న ( Gorati Venkanna) కలసి ఆలపించిన ఈ పాట అందరిలో ఉత్తేజాన్ని కలిగిస్తోంది.
'పదగతులు స్వరజతులు పల్లవించిన నేల.. తేనె తీయని వీణ రాగాల తెలగాణ
ద్విపద దరువుల నేల.. యక్ష జ్ఞానపు శాల.. పోతనా కవి యోగి.. భాగవత స్కందాల
జయ గీతికై మోగెరా.. తెలగాణ జమ్మి కొమ్మై ఊగెరా.. సింగిడై పొంగిందిరా తెలగాణ
తంగెడై పూసిందిరా'' అంటూ సాగిన లిరిక్స్ పవర్ ఫుల్, ఇన్స్ప్రేషన్గా ఉన్నాయి.
పాట ఆవిష్కరణ సందర్భంగా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్ధార్ సుజాత, సింగర్ విహ, గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ పాట గురించి రాకింగ్ రాకేష్ ను కెసిఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసుధనా చారి , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.