మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాయి కొర్రపాటికి మాటిచ్చా.. హనుమంతునికి వ్యాపార కాలుష్యం అంటనివ్వను: పురాణపండ

ABN, Publish Date - Apr 13 , 2024 | 05:59 AM

తన ఆత్మబంధువైన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటికి మాట ఇచ్చానని... ఈ కారణంగానే కాకుండా ఇంతటి తేజోమయ గ్రంధాలను ఆంజనేయస్వామి ఆజ్ఞగా అందించగలిగానని... ఈ అద్భుతాలకు వ్యాపార కాలుష్యం అంటడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అధికారులకు తిరుగులేఖలో పురాణపండ శ్రీనివాస్ సమాధానమివ్వటం ఆశ్చర్య పరిచిందంటున్నారు ఉన్నతాధికారులు.

Celebrities with Nenunnanu Book

భారతదేశంలో ఏ మారుమూల కుగ్రామానికి వెళ్లినా హనుమంతుని విగ్రహమో... ఆలయమో ఉండి తీరుతుంది. భారతదేశ హిందువులకు ఆంజనేయుడంటేనే అంతటి భక్తి. హనుమంతుని పేరు విన్నా.. స్మరించినా ఒక ధైర్యం, ఒక ప్రగాఢ నమ్మకం. ఇది తరతరాల భారతీయుల విశ్వాసం. వైష్ణవుడైనా.. శైవుడైనా... శాక్తేయడైనా... ఎవరికైనా సరే... ఆంజనేయుడంటే అంత ఇష్టం. అలాంటి ఆంజనేయ భగవానునిపై ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక పూర్వ ముఖ్య సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) దేశంలోనే తొలిసారిగా అతి అరుదైన ఆంజనేయ వర్ణ చిత్రాలతో, దివ్య తేజోమయ అఖండ శిల్ప సౌందర్యాలతో పాటు ఋగ్యజుస్సామాధర్వణ వేదాల మంత్రం శక్తులు నిండినట్లుగా వివిధాత్మకమైన యంత్ర మంత్ర వ్యాఖ్యాన కథలతో రచనా సంకలనం చేసిన రెండు అపురూప మహా గ్రంధాలు ‘నేనున్నాను’ (Nenunnanu), ‘నన్నేలు నాస్వామి’ (Nannelu Naa Swamy) అంటూ విడుదల చేసి సుమారు నాల్గు సంవత్సరాలు కావస్తున్నా... ఈ రెండు అపూర్వ గ్రంధాలకు డిమాండ్ ఆనతి నుండీ పెరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడా తగ్గక పోవడం గమనార్హం.

ఇటీవల దేశంలోనే తొలిసారిగా సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో... అతి అరుదైన కృష్ణ శిలలతో... హిమాలయ పర్వత శ్రేణుల స్వచ్ఛ స్పటిక లింగ ప్రతిష్టతో మహా శివాలయాన్ని ‘శ్రీ అమృతేశ్వర దేవస్థానం’గా బళ్లారి మహా నగరంలో నిర్మాణం చేసి చరిత్రకెక్కిన ప్రముఖ చలన చిత్ర నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి (Sai Korrapati), శ్రీమతి రజనీ కొర్రపాటి (Rajini Korrapati) ఈ పరమ పవిత్రమైన వానరవీరుని ఈ రెండు మహాగ్రంధాలకు సౌజన్యభరిత సమర్పకులవ్వడం ప్రత్యేక విశేషంగానే చెప్పకతప్పదు.

కొందరు పీఠాధిపతులు సైతం ఆశ్చర్యపోయేలా సుమారు ఏడువందల పేజీలతో పూర్తి హనుమత్కటాక్షంగా భక్త పాఠకలోకానికి అందిన ఈ మహా గ్రంధాల్లో ఉన్న రామతత్వం, హనుమత్తత్వం వల్ల ఆకర్షితులైన భారతీయ జనతాపార్టీ శ్రేణులు, ఆర్ ఎస్ ఎస్ బృందాలు భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా (Amit Shah) దృష్టికి తీసుకురాగా ఈ గ్రంథ రచయిత, గ్రంథ సమర్పకులైన పురాణపండ శ్రీనివాస్, సాయి కొర్రపాటిలను పిలిపించి న్యూ ఢిల్లీ మహానగరంలో ‘నన్నేలు నాస్వామి’ గ్రంధాన్ని ఆవిష్కరిండం చరిత్రాత్మకమే.

ఈ మహా మారుతి తేజస్సును దగ్గరినుండి ఆవిష్కరించడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) చూపిన ఉత్సాహం, హనుమంతునిపై వుండే భక్తిని, పురాణపండ అవిశ్రాంత ప్రతిభా సంపత్తిని తెలియజేసిందని నాడే కొందరు ప్రముఖులు బాహాటంగా స్పష్టం చేశారు. నాటి భారతదేశ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee), తరువాత కాలంలోని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu)... భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా మొదలు... హిందీ సినీ ప్రముఖుడు సంజయ్ దత్ (Sanjay Dutt), తెలుగు సినీ ప్రముఖులు పద్మశ్రీ ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli), ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి (MM Keeravani), పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)., నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)... వంటి వారు ఈ గ్రంధాలను చూసి అభినందించి, వారి హౌస్ లైబ్రరీలో భద్రపరచడం హనుమంతుని కటాక్షమే.

మరోవైపు శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్, శ్రీ శ్రీ శ్రీ సిద్గ్గేశ్వరానంద భారతీ స్వామి వంటి మహాత్ములు ఇంతటి అఖండ గ్రంథమా అంటూ ఆశ్చర్యపోయి... ఇది కేవలం శ్రీనివాస్ పూర్వజన్మ సుకృతంగానే భావించడం ఈ గ్రంధాల వైభవానికి ఒక పవిత్ర మర్యాద.

అయితే... ఇటీవ జాతీయ గ్రంధాలయ సంస్థ ఈ అద్భుతగ్రంధాలను దేశ వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు విలువైన ధరకు పంపిణీ చెయ్యమని ఆదేశిస్తే పురాణపండ శ్రీనివాస్ వారి ఆదేశాలకు స్పందించకపోవడం జాతీయ గ్రంధాలయ అధికారులను ఆశ్చర్య పరిచింది.

తీరా ఆరా తీస్తే ఇంతటి అఖండ గ్రంధాలను వ్యాపారం చేయలేనని, తన ఆత్మబంధువైన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటికి మాట ఇచ్చానని... ఈ కారణంగానే కాకుండా ఇంతటి తేజోమయ గ్రంధాలను ఆంజనేయస్వామి ఆజ్ఞగా అందించగలిగానని... ఈ అద్భుతాలకు వ్యాపార కాలుష్యం అంటడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అధికారులకు తిరుగులేఖలో సమాధానమివ్వటం ఆశ్చర్య పరిచిందంటున్నారు ఉన్నతాధికారులు. ఏది ఏమైనా ఈ మహోన్నతగ్రంధంతో సాయి కొర్రపాటి, పురాణపండ శ్రీనివాస్ భారతీయ తెలుగు భక్తి చరిత్రలో వెలుగుల్లా మిగలడం సత్యం.

Updated Date - Apr 15 , 2024 | 09:43 PM