Pawan Kalyan: రామోజీరావు అక్షర యోధుడు
ABN , Publish Date - Jun 08 , 2024 | 09:32 AM
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన అక్షర యోధుడు రామోజీ రావు అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన రామోజీరావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ఘనంగా నివాళులు అర్పిస్తూ.. జనసేన తరపున ఓ లేఖను విడుదల చేశారు పవన్ కళ్యాణ్.
![Pawan Kalyan: రామోజీరావు అక్షర యోధుడు](https://media.chitrajyothy.com/media/2024/20240604/Pawan_Kalyan_Ramoji_Rao_446ebac84f.jpg)
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన అక్షర యోధుడు రామోజీరావు (RamojiRao) అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). బహుముఖ ప్రజ్ఞశాలి అయిన రామోజీరావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ఘనంగా నివాళులు అర్పిస్తూ.. జనసేన తరపున ఓ లేఖను విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున 4.50 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రముఖులెందరో నివాళులు అర్పిస్తున్నారు. (RIP Sir)
‘‘అక్షర యోధుడైన రామోజీరావుగారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు (Eenadu) పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు. వర్తమాన రాజకీయాలపై, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు... ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం రామోజీరావు గారి దక్షతను తెలియచేసింది. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. (RamojiRao No More)
పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను వేదికగా చేశారు. మీడియా మొఘల్గా రామోజీరావు గారు అలుపెరుగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. అక్షర యోధుడు రామోజీ రావు గారు అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలచి వేస్తోంది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి. రామోజీరావు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.