Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

ABN , Publish Date - Jan 20 , 2024 | 03:52 PM

ఇది రాముడు పుట్టిన దేశం.. ఇది రామ జన్మ భూమి అని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అయోధ్య శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?
Mohan Babu

500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరబోతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు దేశంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో (Film Nagar Temple) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మోహన్ బాబు మాట్లాడుతూ..

‘‘ఫిల్మ్ నగర్‌లో దైవ సన్నిధానం దేవాలయాన్ని అందరి కోసం నిర్మించాం. ఈ మధ్య కాలంలో దైవ సన్నిధానం పాలక మండలి చైర్మన్ పదవిని నేను స్వీకరించాను. ఈ దేవాలయంలో 18 మూర్తులు, 15 మంది బ్రాహ్మణోత్తములున్నారు. ఈ దైవ సన్నిధానంలో కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని భక్తులు ఎందరో చెబుతున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి, సాయి బాబా, శ్రీరాముడు, లక్ష్మీ నరసింహ స్వామి, సంతోషిమాత ఇలా 18 మంది దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇది రాముడు పుట్టిన దేశం.. ఇది రామ జన్మ భూమి అని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనవరి 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి ఊరూరా తరలి వెళ్తున్నారు. నాకు కూడా ఆహ్వానం అందింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా రాలేకపోతున్నాను.. క్షమించమని ఉత్తరం రాశాను. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దైవ సన్నిధానంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అందరూ వచ్చి విజయవంతం చేయండి’’ అని కోరారు. (Ayodhya Ram Mandir Inauguration)


Mohan-Babu.jpg

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధాన ప్రధాన అర్చకులు రాంబాబు (Ram Babu) మాట్లాడుతూ.. ‘‘అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దైవ సన్నిధానంలో జనవరి 14 నుంచి జనవరి 22 వరకు వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రం పూట భక్తి కీర్తనలు, భరత నాట్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. జనవరి 21 సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాలకు అందరూ విచ్చేసి సీతారాముల అనుగ్రహాన్ని పొందగలరు’’ అని అన్నారు.

Updated Date - Jan 20 , 2024 | 03:52 PM