Tollywood: చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - May 24 , 2024 | 10:02 PM

చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అరెస్ట్‌తో ఎప్పుడూ వార్తలలో ఉండే చిత్రపురి కాలనీ మరోసారి హైలెట్ అవుతోంది. ఆయన అరెస్ట్ అనంతరం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిత్రపురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, డబ్బులు చెల్లించిన కమిటీ సభ్యులకు ప్లాట్లను కేటాయించకుండా.. కేటాయించిన వారికి రద్దు చేసి మరొకరికి ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిన పోలీసులు చెబుతున్నారు.

Tollywood: చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
Chitrapuri Colony

చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అరెస్ట్‌తో ఎప్పుడూ వార్తలలో ఉండే చిత్రపురి కాలనీ మరోసారి హైలెట్ అవుతోంది. ఆయన అరెస్ట్ అనంతరం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిత్రపురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, డబ్బులు చెల్లించిన కమిటీ సభ్యులకు ప్లాట్లను కేటాయించకుండా.. కేటాయించిన వారికి రద్దు చేసి మరొకరికి ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిన పోలీసులు చెబుతున్నారు. మణికొండ చిత్రపురికాలనీలోని ప్లాట్ల కేటాయింపు కోసం కమిటీ సభ్యులుగా పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, చంద్రమధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డిలతో పాటు చనిపోయిన సొసైటీ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ వంటి వారున్నారు.

మాదాపూర్‌కు చెందిన తోట శ్రీపద్మ రూ.12 లక్షలు చెల్లించింది. తనకు అలాట్ చేసిన ఆర్‌హెచ్ 24ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని మార్చి 7వ తేదిన రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లాట్ కోసం యనమల మాధవ్ రూ. 4లక్షలు చెల్లించగా.. డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్ అలాట్‌మెంట్‌ను కమిటీ సభ్యులు రద్దు చేశారని, తాను చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని మార్చి 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించి, అలాట్‌మెంట్ రద్దైన బాధితుల సంఖ్య 150 వరకు ఉంటుందని, ఒక్కొక్కరి వద్ద నుండి రూ. 4 లక్ష నుండి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.


పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, చంద్రమధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డిలతో పాటు చనిపోయిన సొసైటీ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేష్‌తో పాటు మరికొందరిపై 420, 120బి, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రపురి కాలనీ ప్లాట్ అలాట్‌మెంట్ల కుంభకోణంలో అధికారుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే..ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై ఎంక్వైరీ వేస్తే వేల కోట్ల కుంభకోణం బయటపడుతుందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Updated Date - May 24 , 2024 | 10:02 PM