Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా వున్నట్టా, లేనట్టా!

ABN , Publish Date - Feb 08 , 2024 | 04:07 PM

పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ తో చేస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా ఇక లేనట్టే అని పరిశ్రమలో ఒక టాక్ వస్తోంది, కానీ ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ వీలును బట్టి ఆ సినిమా ఉండొచ్చు అని ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఈ సినిమా వున్నట్టా, లేనట్టా...

Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా వున్నట్టా, లేనట్టా!
Pawan Kalyan as Hari Hara Veeramallu

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వుంది. ఇంతకీ ఈ సినిమా వున్నట్టా, లేనట్టా అనే విషయం గురించి చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండటం, అతను రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించటం వలన అతను చేస్తున్న సినిమాలు దాదాపు అన్నీ ఈ సంవత్సరం ఎన్నికలు అయ్యాక విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజి' సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న విడుదలవుతుందని కొన్ని రోజుల క్రితం ఆ చిత్ర నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సుజీత్ దర్శకుడు కాగా డివివి దానయ్య నిర్మాత. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇంకో రెండు సినిమాలు కూడా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి దర్శకుడు హరీష్ శంకర్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' రెండోది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు'.

Harihara.jpg

ఇందులో 'సర్దార్ గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు రవి తేజతో సినిమా చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఉండకపోవచ్చు, లేదా ఎన్నికలు అయ్యాక పవన్ కళ్యాణ్ వీలును బట్టి కొంత సమయం ఏదైనా కేటాయిస్తే ఆ సినిమా ఉండొచ్చు అని అంటున్నారు. మరి 'హరి హర వీరమల్లు' సినిమాకి వచ్చేసరికి ఈ సినిమా గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. ఈ సినిమా ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఇది ఒక పీరియడ్ డ్రామా కథ. నిధి అగర్వాల్ కథానాయిక, కాగా బాబీ డియోల్ ని విలన్ పాత్రకి ఎంపిక చేశారు.

ఈ సినిమా మొదలు పెట్టి సుమారు నాలుగు సంవత్సరాలు అయింది, మధ్యలో కొన్ని రోజులు తన వీలును బట్టి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి కొంత సమయం కేటాయించినా, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ సినిమా చెయ్యడానికి ఆస్కారం లేదు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అందుకని ఈ సినిమా ఉండకపోవచ్చు అని అంటున్నారు. దీనికి ఎ ఎం రత్నం నిర్మాత. ఈ సినిమా ప్రారంభించాక మధ్యలో దొరికిన సమయంలో వైష్ణవ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా క్రిష్ 'కొండ పొలం' అనే సినిమా చేసి విడుదల చేశారు. అది 2021లో విడుదలైంది. కానీ ఆ తరువాత క్రిష్ వేరే సినిమా చేయలేకపోయారు. ఇప్పుడు 'హరి హర వీరమల్లు' ఎలాగూ మొదలయ్యే సూచనలు లేవు కాబట్టి, దర్శకుడు క్రిష్ వేరే సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - Feb 08 , 2024 | 04:07 PM