Prabhas: అయోధ్యలో భోజనం ఖర్చులు.. ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం! నిజ‌మేంటంటే?

ABN , Publish Date - Jan 19 , 2024 | 07:36 PM

శ‌తాబ్దాలుగా హిందువులంతా ఎదురు చూస్తున్న అయోధ్య‌ రామ మందిర ప్రారంభానికి మ‌రో మూడు రోజుల స‌మ‌య‌మే ఉంది. అయితే తాజాగా ప్ర‌భాస్ అయోధ్య భోజ‌న ఖ‌ర్చుల గురించిన వార్త‌ నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న‌ది.

Prabhas: అయోధ్యలో భోజనం ఖర్చులు.. ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం! నిజ‌మేంటంటే?
prabhas

శ‌తాబ్దాలుగా హిందువులంతా ఎదురు చూస్తున్న అయోధ్య‌ రామ మందిర (AyodhaRamMandir) ప్రారంభానికి మ‌రో మూడు రోజుల స‌మ‌య‌మే ఉంది. దేశంలో ఏ ఒక్క‌రిని క‌దిలించినా ఇప్పుడు ఈ విష‌య‌మే ప్ర‌ధాన వార్త‌. ఏ టీవీ పెట్టినా, రెడియో ఆన్ చేసినా, పేప‌ర్లు చూసినా రామ మందిరానికి సంబంధించిన వార్తే వినిపిస్తున్న‌ది, క‌నిపిస్తున్న‌ది. అఖ‌రుకు మోబైల్‌లోనూ గ్రూపుల్లో ప్ర‌తి నిమిషానికో న్యూస్ అయోధ్య రామ మందిరానిదే అయి ఉంటుంది. ఆ దేశం నుంచి ఇన్ని కానుక‌లు వ‌స్తున్నాయ్‌, ఇక్క‌డి నుంచి ఇన్ని ల‌డ్డూలు వ‌స్తున్నాయి, వీటి ఖ‌ర్చు ఎంతో తెలుసా, అవి ఎక్క‌డ చేశారో తెలుసా అంటూ ఇబ్బ‌డిముబ్బ‌డిగా వార్త‌ల ప్ర‌వాహం కొన‌సాగుతుంది. ప్ర‌జ‌లు చూస్తున్నారు ఇత‌రుల‌కు షేర్ చేస్తున్నారు.

తాజాగా ఈ కోవ‌లోనే మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న‌ది. అదేంటంటే ప్ర‌భాస్ (Prabhas) అయోధ్య భోజ‌న ఖ‌ర్చుల గురించి. జ‌న‌వ‌రి 22న‌ అయోధ్య‌లో రామ మందిరం ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది హిందువులు ఇప్ప‌టికే అయోధ్య‌కు ప‌య‌న‌మ‌వ‌గా బాల రాముడి విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ట నాటికి భ‌క్తులు ల‌క్ష‌ల్లో రానున్నారు. ఈ సంద‌ర్బంగా అక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల భోజ‌నాల కోసం సినీ న‌టుడు ప్ర‌భాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చాడ‌ని, దాదాపు 300కు పైగా ప్ర‌దేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా కోన‌సీమ జిల్లా కొత్త‌పేట‌ ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి కూడా ఈ మాట ప్ర‌స్తావించ‌డంతో ఈ అంశం మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది.


చాలా మంది ఈ విష‌యాన్ని త‌మ వాట్స‌ప్‌ల‌లో, ఇత‌ర సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లోనూ షేర్ చేస్తున్నారు. కొంద‌రు ఈ విష‌యం ఫేక్ అని, కొంత మంది అదే నిజ‌మ‌ని, మ‌రి కొంత‌మంది ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ద‌మో తెలియ‌క‌ అయోమ‌యంలో ఉండిపోయారు. అయితే ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో జాతీయ మీడియా ప్ర‌భాస్ (Prabhas) స‌న్నిహితుల‌తో మాట్లాడ‌గా ఈ వార్త‌ల‌న్నీఫేక్‌, రూమ‌ర్స్ అని ఇలాంటి వార్త‌ల‌ను స్ప్రెడ్ చేయోద్ద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో పెద‌నాన్న కృష్ణంరాజు మ‌ర‌ణించిన స‌మ‌యంలో ప్ర‌భాస్ త‌మ స్వ‌గ్రామం మొగ‌ల్తూరులో అన్న‌దానం చేయ‌గా దాదాపు 10 ల‌క్ష‌ల‌కు పైగానే అభిమానులు, ప్ర‌జ‌లు హ‌జ‌రైనట్లుగా వార్త‌లు ఉన్నాయి. అదేవిధంగా ప్ర‌భాస్‌తో సినిమాల‌లో న‌టించే ప్ర‌తి యాక్ట‌ర్‌కి త‌న ఇంటి నుంచి భోజ‌నాలు పంపిస్తాడ‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే అయోధ్యలో రామ మందిరం (AyodhaRamMandir) ప్రారంభం సంద‌ర్భంగా అ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని కొంత‌మంది అభిమానులు ప్ర‌భాస్ ఇత‌రుల‌పై చూపించే అప్యాయ‌త‌ను అయోధ్య‌కు అన్వ‌యిస్తూ ప్ర‌భాస్ (Prabhas) అన్న‌దానం చేస్తున్నాడ‌ని అందుకే రూ,50 కోట్ల విరాళం ఇచ్చాడ‌న్న‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Jan 19 , 2024 | 07:48 PM