గుర్తింపు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారా?
ABN , Publish Date - Feb 21 , 2024 | 03:57 AM
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజుపై హీరోయిన్ త్రిష మండిపడ్డారు. ‘‘గుర్తింపు కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు కొందరివి...
![గుర్తింపు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారా?](https://media.chitrajyothy.com/media/2024/20240215/12_Cj_550d8f4604.jpg)
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజుపై హీరోయిన్ త్రిష మండిపడ్డారు. ‘‘గుర్తింపు కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు కొందరివి... ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు కోరతాను ’’ అంటూ ఆమె మంగళవారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇటీవల ఏవీ రాజు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఓ ఎమ్మెల్యే హీరోయిన్ త్రిషకు డబ్బులిచ్చి కూవత్తూరు పంచాయతీ లోని ఓ రిసార్ట్కు తీసుకొచ్చారని, ఈ విషయం నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్కు తెలుసని అన్నారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో దుమారం రేపుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్టు చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులు కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, ప్రధాన కార్యదర్శి బీఎన్ స్వామినాథన్ సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)