పిల్లల్ని ఎలా పెంచాలో చూపించాం
ABN , Publish Date - Mar 27 , 2024 | 01:42 AM
‘అల్లంత దూరాన’, ‘కళా పోషకులు’, ‘జై సేన’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు యంగ్ హీరో విశ్వ కార్తికేయ. ప్రస్తుతం ఆయన నటించిన ‘కలియుగం పట్టణంలో’ చిత్రం...
![పిల్లల్ని ఎలా పెంచాలో చూపించాం](https://media.chitrajyothy.com/media/2024/20240326/9_CJ_123c927e09.jpg)
‘అల్లంత దూరాన’, ‘కళా పోషకులు’, ‘జై సేన’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు యంగ్ హీరో విశ్వ కార్తికేయ. ప్రస్తుతం ఆయన నటించిన ‘కలియుగం పట్టణంలో’ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విశ్వ కార్తికేయ, మంగళవారం మీడియాతో ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
‘‘ప్రతీ ఒక్కరిలో వివిధ రకాల షేడ్స్ ఉంటాయి. వాటిని చూపించేలా ఈ చిత్రం ఉంటుంది. ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని అనుకుంటున్న సమయంలోనే నేను ఈ కథ విన్నాను. దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఈ కథ చెప్పిన విధానానికి ఆశ్చర్యపోయాను. క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో కనిపెట్టలేకపోయాను. అందుకే సెకండ్ థాట్ లేకుండా ఈ చిత్రంలో నటించడానికి ఒప్పేసుకున్నా. ఈ సినిమాలో ప్రతీ పాత్రను దర్శకుడు చక్కగా మలిచారు. అన్ని క్యారెక్టర్లకు టూ షేడ్స్ ఉంటాయి. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో ఉన్న మదర్ సెంటిమెంట్ ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రం నా కెరీర్లోనే ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాలో సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే ఎలా ఉంటుందో చూపించాం. ఇందులో క్రైమ్ సీన్లను కూడా సరికొత్తగా ప్రజంట్ చేశాం. ‘కలియుగం పట్టణంలో’ టెక్నికల్గా ఎంతో బాగుంటుంది. కెమెరా వర్క్కు అందరూ ఆశ్చర్యపోతారు. పాటలు, రీ రికార్డింగ్ అద్భుతంగా వచ్చాయి. అజయ్ మాకు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఇండోనేషియన్ సినిమాలో నటిస్తున్నాను. మంత్ర, తంత్రాలు, చేతబడుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది’’ అని చెప్పారు.