ఇంతవరకూ రాని కాన్సెప్ట్ ఇది
ABN , Publish Date - Apr 30 , 2024 | 06:31 AM
‘ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో ఇంతవరకూ ఇండియాలోనే ఏ సినిమా రాలేదు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘ప్రసన్నవదనం’ చిత్రం ఉంటుంది. చివరి వరకూ సర్ప్రైజ్ అయ్యే కంటెంట్ ఉంది’ అన్నారు...
![ఇంతవరకూ రాని కాన్సెప్ట్ ఇది](https://media.chitrajyothy.com/media/2024/20240428/4_Cj_bce621d206.jpg)
‘ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో ఇంతవరకూ ఇండియాలోనే ఏ సినిమా రాలేదు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘ప్రసన్నవదనం’ చిత్రం ఉంటుంది. చివరి వరకూ సర్ప్రైజ్ అయ్యే కంటెంట్ ఉంది’ అన్నారు నిర్మాత జె.ఎస్.మణికంఠ. సుహాస్ హీరోగా ఆయన నిర్మించిన ‘ప్రసన్నవదనం’ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకుంటూ ‘నేను ఇంతకుముందు ‘కలర్ ఫొటో’, ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రాలకు సహ నిర్మాతగా పని చేశాను. దర్శకుడు సుకుమార్ దగ్గర పని చేసిన అర్జున్ చెప్పిన కథ నాకు నచ్చింది. సుహాస్ కూడా ఆ కథను ఓకే చేశారు. అలా ‘ప్రసన్నవదనం’ ప్రాజెక్ట్ మొదలైంది. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బిజినెస్ పరంగా లాభాల్లో ఉన్నాం. మైత్రీ, హోంబలే వంటి పెద్ద సంస్థలు మా చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. హీరో సుహాస్ గురించి చెబుతూ ‘తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ వరం సుహాస్. ఇప్పుడు చాలా మంది దర్శకులు ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు. తనపై కొత్త కథలు వర్కవుట్ అవుతున్నాయి. చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. దర్శకనిర్మాతలకు కంఫర్ట్గా ఉండే హీరో’ అని చెప్పారు మణికంఠ.
‘థ్రిల్లర్ అనగానే డార్క్ లైట్ సెట్ చేస్తారు. అందుకే మా సినిమాకు అటువంటి లైట్ వద్దనుకున్నాం. థ్రిల్లర్కి కావాల్సిన టోన్ సెట్ చేసి లవ్లీగా, బ్యూటిఫుల్గా ఉండేలా చూసుకున్నాం. మా డీఓపీ చంద్రశేఖర్ను ఈ విషయంలో ప్రశంసించాలి. అలాగే దర్శకుడు అర్జున్ అద్భుతమైన వర్క్ చేశారు. ఎటువంటి ఎమోషన్ తో కథ చెప్పారో అదే తెరపైకి తెచ్చారు. తనకి కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వడంతో సినిమాను బాగా తీశాడు. భవిష్యత్లో పెద్ద దర్శకుడవుతాడు’ అన్నారు. తమ తదుపరి చిత్రం కూడా సుహాస్తోనే ఉంటుందని మణికంఠ చెప్పారు.