మాట వినే హీరోలు దొరికారు
ABN , Publish Date - Mar 19 , 2024 | 04:03 AM
‘పంపిణీదారుడిగా కంటే నిర్మాతగా జర్నీ బాగుంది. నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతకు ఉంటుంది’ అన్నారు నిర్మాత రాజేశ్ దండా. హాస్య మూవీస్ బేనర్పై పలు సినిమాలు నిర్మిస్తున్న...
![మాట వినే హీరోలు దొరికారు](https://media.chitrajyothy.com/media/2024/20240313/6_CJ_9c3f978f61.jpg)
‘పంపిణీదారుడిగా కంటే నిర్మాతగా జర్నీ బాగుంది. నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతకు ఉంటుంది’ అన్నారు నిర్మాత రాజేశ్ దండా. హాస్య మూవీస్ బేనర్పై పలు సినిమాలు నిర్మిస్తున్న ఆయన పుట్టినరోజు (మంగళవారం) సందర్భంగా సోమవారం మీడియాతో ముచ్చటించారు. కొత్త ప్రాజెక్టుల గురించి వివరించారు.
‘స్వామిరారా’ చిత్రంతో పంపిణీదారుడిగా ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి దాదాపు 82 సినిమాలు విడుదల చేశా. ‘ఒక్క క్షణం’, ‘నాంది’ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించా. అనిల్ సుంకర్తో జర్నీ మొదలుపెట్టి ‘ఊరిపేరు బైరవకోన’, ‘‘సామజవర గమన’ సినిమాలు తీశా. ప్రస్తుతం. సుబ్బు దర్శకత్వంలో ‘బచ్చలమల్లి’ సినిమా తీస్తున్నా. 90వ దశకంలో జరిగిన కథతో ‘బచ్చలమల్లి’ చిత్రం తీస్తున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అన్నవరం, తుని పరిసర ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాం. మే 10 నుంచి జరిగే సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేస్తాం. ‘అల్లరి’ నరేశ్ చిత్రం యాభై శాతం పూర్తయింది. ఆ తర్వాత సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం చిత్రాలు ఉంటాయి. వీరు కాకుండా మరో హీరోతో సినిమా చేయబోతున్నా. వివరాలు త్వరలో చెబుతా.
నేను చేసే హీరోలు నాకు పర్సనల్ ఫ్రెండ్స్. అన్నీ స్టడీ చేసి సినిమా ప్లాన్ చేస్తుంటా. నా అదృష్టం కొద్దీ నా మాట వినే హీరోలు దొరికారు. కథ, ప్రీ ప్రొడక్షన్, మేకింగ్.. అన్నింటిలో నా ప్రమేయం ఉంటుంది. పంపిణీదారుడిగా ఉన్న అనుభవం నాకు ఉపయోగపడుతోంది.
హాస్య మూవీస్ బేనర్లో తీసే చిత్రాలకు కొత్త కథలు, మంచి కథాంశాలు ఎన్నుకుంటున్నాం. ఇప్పటివరకూ అలాంటివే తీశాం. దర్శకుడు త్రినాథ్తో తీసే సినిమా కూడా భిన్నమైన కథాంశంతో ఉంటుంది. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. అందుకే నా సినిమాలో యాక్షన్ పార్ట్ కథానుగుణంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటా.అలాగే పాన్ ఇండియా హీరో, కథ లభిస్తే వచ్చే ఏడాది పాన్ ఇండియా సినిమా తీస్తా. అలాగే ఓ పెద్ద హీరోతో వచ్చే ఏడాది పెద్ద సినిమా తీస్తున్నా. అది ఎవరనేది ప్రన్తుతానికి సస్పెన్స్.