వారిద్దరికీ మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది
ABN , Publish Date - Jan 19 , 2024 | 05:04 AM
ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. వజ్రాన్ని కూడా సాన పట్టాలి .అలా ‘మనదేశం’ సినిమాలో నాన్నగారికి అవకాశం ఇచ్చి నటుడిగా మెరుగులు దిద్దిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్గారికీ, నిర్మాత కృష్ణవేణిగారికి....
![వారిద్దరికీ మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది](https://media.chitrajyothy.com/media/2023/20231205/2_CJ_1703f537de.jpg)
ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. వజ్రాన్ని కూడా సాన పట్టాలి .అలా ‘మనదేశం’ సినిమాలో నాన్నగారికి అవకాశం ఇచ్చి నటుడిగా మెరుగులు దిద్దిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్గారికీ, నిర్మాత కృష్ణవేణిగారికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది’ అన్నారు నందమూరి మోహనకృష్ణ. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ చిత్రం 75 వసంతాల వేడుకలు గురువారం హైదరాబాద్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో జరిగాయి. ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మనదేశం’ చిత్ర నిర్మాత కృష్ణవేణి, దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేశ్ప్రసాద్, ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన పూర్ణా పిక్చర్స్ అధినేత విశ్వనాథ్లను సత్కరించారు. సెలబ్రేషన్స్ కమిటీ ఛైర్మన్ జనార్థన్ మాట్లాడుతూ ‘నలభై ఏళ్ల తర్వాత దేశానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఊహించి ముందే చెప్పిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ఆయన గొప్పతనం గురించి ప్రపంచ ప్రజలందరికీ తెలుసు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆదిశేషగిరిరావు, నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, హైదరాబాద్ మింట్ తరఫున శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.