O Thandri Theerpu: ‘ఓ తండ్రి తీర్పు’ విడుదల ఎప్పుడంటే..
ABN , Publish Date - Dec 16 , 2024 | 11:46 PM
వివా రెడ్డి హీరోగా నటించిన ‘ఓ తండ్రి తీర్పు’ మూవీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.
ఏవికె ఫిలిమ్స్ బ్యానర్పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో, లయన్ శ్రీరామ్ దత్తి నిర్మించిన చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన, దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు తెరకెక్కించారు. వివా రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది. డాక్టర్ కెవి రమణా చారి ఆశీస్సులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 27న గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది.
కుటుంబ విలువలతో ‘ఓ తండ్రి తీర్పు’ సినిమాను నిర్మించినట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుందని వారు తెలిపారు. ఈ చిత్రంలో కొడుకుగా వివా రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు. కాగా, సేవా సార్వభౌములు, పుణ్య దంపతులు లయన్స్ శ్రీమతి ఆరిగపూడి కృష్ణ కుమారి, డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ గార్లకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. వివా రెడ్డి, రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్, కునాల్, కుషాల్, చిత్రం బాషా, అనురాధ, రారాజు, సురభి శ్రావణి, పునర్వి, రమ్య, శివాజీ, తదితరులు ఇతర పాత్రలలో నటించారు.