రాంబో, టెర్మినేటర్ తరహాలో...
ABN , Publish Date - Feb 09 , 2024 | 03:11 AM
‘ఈగల్’ చిత్రంలో మునుపెన్నడూ చూడని రవితేజను ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్లోనే విధ్వంసం ఉంది. కంటెంట్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది’ అని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. రవితేజ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం...
![రాంబో, టెర్మినేటర్ తరహాలో...](https://media.chitrajyothy.com/media/2023/20231205/5_CJ_f7be3f4693.jpg)
‘ఈగల్’ చిత్రంలో మునుపెన్నడూ చూడని రవితేజను ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్లోనే విధ్వంసం ఉంది. కంటెంట్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది’ అని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. రవితేజ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కావ్య థాపర్, అనుపమా పరమేశ్వరన్ కథానాయికలు. ‘ఈగల్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను కార్తీక్ మీడియాతో పంచుకున్నారు.
‘ఈగల్’లో కథానాయకుడు సాధారణ పత్తి రైతులా కనిపిస్తాడు. కానీ ఓ అంతర్జాతీయ సమస్యపైన అతను పోరాటం చేస్తుంటాడు. ‘రాంబో, టెర్మినేటర్’ లాంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. మనం కూడా అలాంటి ఒక సినిమా తీయాలనే ప్రయత్నంలోంచే ‘ఈగల్’ పుట్టింది. ఇదొక అద్భుతమైన యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్. ప్రేక్షకులను అలరిస్తుంది. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం చే యాలనేది దర్శకుడిగా నా కల. అది ‘ఈగల్’తో నెరవేరింది.
పక్షుల్లో గద్దకు చాలా సునిశితమైన దృష్టి ఉంటుంది. సుదూరాన ఉన్న లక్ష్యాన్ని సైతం చూసి వేటాడుతుంది. ఈ సినిమాలో కథానాయకుడికి కూడా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేయగల నైపుణ్యం ఉంటుంది. అందుకే ‘ఈగల్’ టైటిల్ పెట్టాం. హిందీలో ‘సహదేవ్ వర్మ’ టైటిల్తో విడుదల చేస్తున్నాం.
‘ధమాకా’ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసే సమయంలో రవితేజకు కథ చెప్పాను. ‘మంచి ఎంటర్టైనర్ అవుతుంది చేద్దాం’ అని వెన్నుతట్టారు. ఈ సినిమా అంతటా ఆయన పాత్ర ఒకేలా ఉంటుంది. ఆయన ఎనర్జీ లెవల్స్ వేరే లెవల్లో ఉంటాయి. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆహారపు అలవాట్లు, నిద్రవేళలు కచ్చితంగా పాటిస్తారు.
ఈగల్ సౌండ్ డిజైన్కే ఆరునెలలు పట్టింది. యూరప్లో రియల్ గన్స్తో షూట్ చేసి ఆ సౌండ్ని రికార్డ్ చేశాం. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహకారం మరువలేనిది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు కావలసిన వనరులు సమకూర్చేవారు.
ఈ చిత్రంలో నవదీప్ నటన ఆశ్చర్యపరుస్తుంది. అనుపమా పరమేశ్వరన్ కథను ముందుకు నడిపించే పాత్రను పోషించారు. త్వరలో తేజ సజ్జతో ఓ చిత్రం చేస్తున్నాను.