Kaliyugam pattanamlo : ఈ ప్రయాణం ఇంతటితో ఆగిపోదు
ABN , Publish Date - Mar 25 , 2024 | 03:57 AM
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు నిర్మించారు. ఈ నెల 29న రాబోతోంది...
![Kaliyugam pattanamlo : ఈ ప్రయాణం ఇంతటితో ఆగిపోదు](https://media.chitrajyothy.com/media/2024/20240322/4_Cj_a9a5d2878f.jpg)
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు నిర్మించారు. ఈ నెల 29న రాబోతోంది. రమాకాంత్ రెడ్డి ఆదివారం మీడియాతో ముచ్చటించారు.
‘‘కలియుగం పట్టణంలో’ అంటే ఊరిపేరు కాదు. కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారు అనేది ఓ పట్టణానికి ముడిపెట్టి ఈ చిత్రంలో చూపించాం. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అయినా ఇందులోని మదర్ సెంటిమెంట్, లవ్, యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. వాటితో పాటు ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంది. కాలేజీ స్టూడెంట్స్ అందరూ దానికి తప్పకుండా కనెక్ట్ అవుతారు. కోడి రామకృష్ణ ‘అరుంధతి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయాణం మొదలుపెట్టి పలువురు దర్శకుల వద్ద పనిచేసాను. ఈ సినిమాను ఇండస్ట్రీ పెద్దలకు చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మొదటి సినిమానే బాగా చేసావు, డేరింగ్గా చేసావు అనడంతో ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకు అజయ్ అరసాద మంచి మ్యూజిక్ అందించారు. ఈ ‘కలియుగ పట్టణంలో’ ప్రయాణం ఇంతటితో ఆగిపోదు..దీనికి సీక్వెల్గా ‘కలియుగ నగరంలో’ వస్తుంది’’ అని చెప్పారు.