Maheshbabu : జక్కన కోసం జేమ్స్‌ కామెరూన్‌?

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:07 AM

షూటింగ్‌కు డేట్‌ ఖాయం కాలేదు, సినిమాకు పేరు ఖరారు కాలేదు, తారాగణం ఎవరనేది తేలనేలేదు అయినా నిత్యం ఏదో ఒక చర్చతో వార్తల్లో నిలుస్తోంది మహేశ్‌బాబు-రాజమౌళి సినిమా. ఈ చిత్రానికి ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’...

Maheshbabu : జక్కన కోసం జేమ్స్‌ కామెరూన్‌?

షూటింగ్‌కు డేట్‌ ఖాయం కాలేదు, సినిమాకు పేరు ఖరారు కాలేదు, తారాగణం ఎవరనేది తేలనేలేదు అయినా నిత్యం ఏదో ఒక చర్చతో వార్తల్లో నిలుస్తోంది మహేశ్‌బాబు-రాజమౌళి సినిమా. ఈ చిత్రానికి ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ అనేది అనధికారికంగా ప్రచారంలో ఉన్న వర్కింగ్‌ టైటిల్‌. ఈ సినిమా గురించి అడపా దడపా కథకులు విజయేంద్ర ప్రసాద్‌ చూఛాయగా చెప్పిన విషయాలను బట్టి ఇదొక అడ్వంచరస్‌ యాక్ష న్‌ డ్రామా అని తెలవడం తప్ప మరేదీ బయటకు రాలేదు. గుప్పిట మూసి ఉన్నంతవరకే గుట్టు అన్నట్లు రాజమౌళి కూడా ఈ సినిమా విషయంలో గుంభనంగా ఉంటున్నారు. కానీ కొంతమంది ఔత్సాహికులు మాత్రం ఏదో ఒక విషయంతో ఈ సినిమాను ప్రతి రోజూ చర్చనీయాంశం చేస్తున్నారు. ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో, సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మేకింగ్‌లోనే కాదు సినిమాకు ప్రచారం తేవడంలోనూ రాజమౌళి సిద్ధహస్తుడు. సినిమాకు మంచి హైప్‌ తేవడం కోసం జాతీయ మీడియాను ఆయన ఆహ్వానించనున్నారని చెబుతున్నారు. ఆ పాత్రికేయ సమావేశంలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని రాజమౌళి భావిస్తున్నారనేది సారాంశం. ఇక ఈ మధ్యన సోషల్‌ మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తున్న విషయం ఈ సినిమా ప్రారంభోత్సవం గురించే. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌తో రాజమౌళి క్లాప్‌ కొట్టించేబోతున్నారట. ఆస్కార్‌ సహా పలు వేదికలపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గురించి మాట్లాడుతూ రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కామెరూన్‌ కొనియాడారు. ఈ నేపథ్యం వల్లనే కామెరూన్‌ వస్తాడా అనే సంశయం ఉన్నా తేలిగ్గా తీసివేయలేకపోతున్నారు. ఇక ఇటీవలే ‘గుంటూరు కారం’ చిత్రంతో అభిమానులను అలరించారు మహేశ్‌బాబు. ప్రస్తుతం రాజమౌళి చిత్రం కోసం ఆయన సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో మహేశ్‌ను సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఆ లుక్‌ బయటకు రాకుండా ఉండేందుకు మహేశ్‌ ప్రైవేట్‌ కార్యక్రమాలకు కూడా హాజరవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ప్రీ ప్రొడక్షన్‌కు మరింత సమయం పట్టనుందట. తొలుత ఉగాదికి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసినా, ఇప్పుడు మహేశ్‌ పుట్టిన రోజైన ఆగస్టు 9న ఓపెనింగ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ అనధికారిక వార్తలే. వీటిలో ఏ ఒక్కదానిపైనా ఇప్పటివరకూ రాజమౌళి కానీ చిత్రబృందం కానీ స్పందించలేదు.

Updated Date - Feb 28 , 2024 | 04:07 AM