సినీ పురోహితుడు రోహిణి శాస్త్రి కన్నుమూత
ABN , Publish Date - Apr 22 , 2024 | 04:30 AM
పౌరహిత్యంలో ‘శాస్త్రి బ్రదర్స్’గా సుప్రసిద్ధులైన అశ్వని, రోహిణి శాస్ర్తుల్లో ఒకరైన రోహిణి శాస్త్రి (70) కన్నుమూశారు. శనివారం ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబీకులు ఆయన్ని...
![సినీ పురోహితుడు రోహిణి శాస్త్రి కన్నుమూత](https://media.chitrajyothy.com/media/2024/20240413/2_CJ_baf49ba097.jpg)
మహేశ్బాబుకు నామకరణం చేసింది ఆయనే
ఎన్టీఆర్ నుంచి ఈతరం హీరోల సినిమాలకు ముహూర్త పూజా కార్యక్రమాల నిర్వహణ
పౌరహిత్యంలో ‘శాస్త్రి బ్రదర్స్’గా సుప్రసిద్ధులైన అశ్వని, రోహిణి శాస్ర్తుల్లో ఒకరైన రోహిణి శాస్త్రి (70) కన్నుమూశారు. శనివారం ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబీకులు ఆయన్ని మేల్కొలిపేందుకు ప్రయత్నించారు. ఆయన అపస్మారక స్థితిలో ఉండడంతో వైద్యులను రప్పించి పరీక్షించగా, అప్పటికే కన్నుమూసినట్లు తేలింది.
సినీరంగంతో ఎనలేని అనుబంధం...
శాస్త్రి బ్రదర్స్ పూర్వీకులది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. రోహిణి శాస్త్రి ప్రాథమిక విద్య టి.నగర్లోని రామకృష్ణ స్కూలులో జరిగింది. వారి తండ్రి తాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రితో కలిసి ఎంజీఆర్, ఎన్టీఆర్ చిత్రాల నుంచి నేటి మహే్షబాబు, విజయ్ వంటి అగ్ర కథానాయకుల సినిమాల వరకు ముహూర్తం, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. హీరో మహే్షబాబుకు నామకరణం చేసిందీ శాస్త్రి బ్రదర్సే. దివంగత దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు తొలి సినిమా ‘తాత మనవడు’ నుంచి ఆయన 100వ సినిమా ‘లంకేశ్వరుడు’ వరకు ముహూర్త పూజా కార్యక్రమాలు వారే నిర్వహించడం మరో విశేషం. శాస్త్రి బ్రదర్స్ పురోహితులుగానే దాదాపు వంద సినిమాల్లో కనిపించారు. రోహిణి శాస్త్రి దాసరి నారాయణరావు రూపొందించిన ‘విశ్వామిత్ర’ సీరియల్లోనూ నటించారు. నేడు టి.నగర్ కన్నమ్మపేట శ్మశానవాటికలో రోహిణి శాస్త్రి భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
చెన్నై, ఆంధ్రజ్యోతి