యాక్షన్ సీక్వెన్స్ చేశా
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:48 AM
‘తిరగబడరా సామి’ లాంటి మంచి ఎంటర్టైనర్తో తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రాధాన్యం ఉన్నపాత్ర చేశాను’ అని మాల్వీ మల్హోత్రా చెప్పారు...
‘తిరగబడరా సామి’ లాంటి మంచి ఎంటర్టైనర్తో తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రాధాన్యం ఉన్నపాత్ర చేశాను’ అని మాల్వీ మల్హోత్రా చెప్పారు. రాజ్ తరుణ్ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మల్కాపురం శివకుమార్ నిర్మాత. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మాల్వీ మల్హోత్రా సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
మాది హిమాచల్ ప్రదేశ్. బుల్లితెరపై నా కెరీర్ మొదలైంది. హిందీ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించాను. ‘తిరగబడరా సామి’ నా తొలి తెలుగు చిత్రం. ఇందులో కథ నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలాగే నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది. ఇలాంటి అవకాశం కెరీర్ ఆరంభంలోనే నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎక్కువగా బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను. ఇందులో నా పాత్ర కూడా ఆయనలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది.
యాక్షన్, డ్రామా, రొమాన్స్, ఫన్... ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. రాజ్ తరుణ్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. సైలెంట్గా మొదలై వైలెంట్గా మారుతుంది.
రవికుమార్ గారు చాలా మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. నిర్మాత శివ గారు సెట్లో అందరినీ సొంత మనుషుల్లా చూసుకున్నారు.
మణిరత్నం, రాజమౌళి సినిమాల్లో నటించాలనేది నా లక్ష్యం. మహేశ్బాబు, అడివిశేష్ అంటే ఇష్టం. నాని కళ్లతోనే అద్భుతమైన భావోద్వేగాలను పండిస్తారు.