అందరికీ కనెక్ట్ అయ్యే కథ
ABN , Publish Date - Apr 26 , 2024 | 06:21 AM
సినిమాలు నిర్మించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో చిత్రపరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం వెదుకుతున్నప్పుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు...
సినిమాలు నిర్మించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో చిత్రపరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం వెదుకుతున్నప్పుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు. పెళ్లి చుట్టూ తిరిగే ఈ కథలో కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్.. అన్నీ ఉన్నాయి. అందుకే ఆ కథతో ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం తీశాను’ అన్నారు నిర్మాత రాజీవ్ చిలక. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
ఈ కథ వినగానే నరేశ్గారినే హీరోగా అనుకున్నాం. మొదట మైండ్లోకి రాజేంద్రప్రసాద్గారు వచ్చినా యంగ్గా ఉంటే ఆయన పర్ఫెక్ట్. ఇప్పుడు నరేశ్కు యాప్ట్. మేం ఆయనకి కథ చెప్పినప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయన కోసం వెయిట్ చేశాం.
పెళ్లి కావడం లేదని చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఈ రోజుల్లో సెటిల్ అవడం కంటే పెళ్లి కావడం పెద్ద టాస్క్గా మారింది. అందుకే అందరికీ కనెక్ట్ అవుతుందని ఈ కథను ఎన్నుకుని వినోదాత్మకంగా చెప్పాం.
సినిమా కోసం కొన్ని టైటిల్స్ అనుకున్నాం కానీ సరిగ్గా సెట్ కాలేదు. అప్పుడు నరేశ్గారే ఈ టైటిల్ సూచించారు. హీరోని అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారు. విసిగిపోయిన హీరో ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటుంటాడు. దర్శకుడు ఇవీవీ సత్యనారాయణగారి క్లాసిక్ సినిమా టైటిల్ ఇది. సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయిన నరేశ్గారు ఈ టైటిల్ వాడుకోండి అని చెప్పారు.
మా బేనరులో మంచి సినిమాలు తీయాలని ఉంది. ఫాంటసీ, హిస్టారికల్, కామెడీ జోనర్స్.. అన్ని రకాలు తీయాలని ఉంది. ఇక యానిమేషన్ విషయానికి వస్తే ‘ఛోటా భీమ్’ని పిల్లలతో చేయబోతున్నాం. అలాగే డిస్నీలో ఒక యానిమేషన్ షో లాంచ్ కాబోతోంది.