బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయం
ABN , Publish Date - May 08 , 2024 | 05:11 AM
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘బాహుబలి’ చిత్రం ఆధారంగా...
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘బాహుబలి’ చిత్రం ఆధారంగా ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ రూపుదిద్దుకుంది. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియా వర్క్స్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, రాజమౌళి, శరత్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించారు. జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ ‘‘బాహుబలి’ ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సిరీస్తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని కొనసాగించాలని ఉన్నా నా ప్రమేయం లేకుండా బాహబలి కథ చెప్పడమా అనిపించింది. ఆ సందిగ్దావస్థలో ఉన్నప్పుడే శరద్ దేవరాజన్ కలిశారు. తన అంకితభావంతో ఈ యానిమేషన్ సిరీస్ను అద్భుతంగా మలిచాడు’ అని ప్రశంసించారు. శరద్ దేవరాజన్ మాట్లాడుతూ ‘రాజమౌళితో పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మాహిష్మతి వెనుక ఉన్న కథలు, రహస్యాలు, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయ’న్నారు.