తెలుగులోనే కాదు ఏ భాషలోనూ రాని సినిమా
ABN , Publish Date - Jan 24 , 2024 | 12:41 AM
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ‘సిద్దార్థ్ రాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి దర్శకుల దగ్గర పనిచేసిన వి.యశస్వీ ఈ సినిమాకు దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మాతలు...
![తెలుగులోనే కాదు ఏ భాషలోనూ రాని సినిమా](https://media.chitrajyothy.com/media/2023/20231205/9_Cj_437cce9817.jpg)
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ‘సిద్దార్థ్ రాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి దర్శకుల దగ్గర పనిచేసిన వి.యశస్వీ ఈ సినిమాకు దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మాతలు. మంగళవారం ఉదయం జరిగిన వేడుకలో థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ ‘తను నమ్మింది బలంగా తీసే క్రియేటర్ యశస్వీ. ‘సిద్ధార్థ్ రాయ్’ వంటి సినిమా తెలుగులోనే కాదు ఏ భాషలోనూ రాలేదు. ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అన్నారు. దర్శకుడు సాయిరాజేశ్ మాట్లాడుతూ ‘ఈ కథ విని ఆశ్చర్యపోయా. ఇలాంటి కథ తీయాలన్నా, అలాంటి పాత్ర చేయాలన్నా గట్స్ కావాలి. ఈ విషయంలో దీపక్ చాలా లక్కీ. అద్భుతంగా నటించారు’ అన్నారు. ‘విలన్ లేకుండా హీరో ఉండడు. ఈ సినిమా ఫస్ట్హాఫ్ విలన్ అయితే, సెకండాఫ్ హీరో. కథ వినగానే అలా అనిపించింది. ఇలాంటి కథతో సమాజానికి ఏం చెప్పదలుచుకున్నావ్ అని దర్శకుడు యశస్వీని కోపడ్డాను. కానీ చాలా అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దారు’ అన్నారు రచయిత లక్ష్మీ భూపాల. ‘అర్జున్రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాల కోసం ఆకలితో ఎదురు చూసే ప్రేక్షకులకు మూడో చిత్రం ‘సిద్దార్థ్ రాయ్’ అని మరో దర్శకుడు వీరశంకర్ చెప్పారు. ‘నా పాత్రను అద్భుతంగా మలిచి ఈ ప్రయాణంలో ప్రతి క్షణం సపోర్ట్ చేసిన మా దర్శకుడికి థాంక్స్. ఈ సినిమాలో పాత్ర గురించి, దాన్ని ఎందుకు చేశానో తర్వాతి వేడుకల్లో మాట్లాడతా’ అన్నారు హీరో దీపక్ సరోజ్.